
ప్రకంపనలు రేపుతున్న బాబాయి-అబ్బాయి!
బాబాయి-అబ్బాయి మధ్య విభేదాలు అధికార సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో ప్రకంపనలు రేపుతున్నాయి
లక్నో: బాబాయి-అబ్బాయి మధ్య విభేదాలు అధికార సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా ఎస్పీ సీనియర్ నేత, అఖిలేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన శివపాల్ యాదవ్ మంత్రిమండలి విస్తరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. రాజ్ భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండటం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గొడవ ఎక్కడ మొదలైంది..
ఎస్పీ అధినేత ములాయం యాదవ్ తమ్ముడైన శివపాల్ యాదవ్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన ఇటీవల ఖవామీ ఎక్త్ దళ్ (క్యూఈడీ) పార్టీని ఎస్పీలో విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఒకప్పటి గ్యాంగ్స్టర్, ప్రస్తుత రాజకీయ నాయకుడైన ముఖ్తార్ అన్సారీ నేతృత్వంలోని క్యూఈఎంను అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్పీలో విలీనం చేసుకోవడానికి సర్వం సిద్ధమైన నేపథ్యంలో దీనికి పార్టీ హైకమాండ్ అడ్డుపుల్ల వేసింది. క్యూఈడీని ఎస్పీలో విలీనం చేసుకోవడం లేదని ఎస్పీ శనివారం స్పష్టం చేసింది. తాను సంకల్పించిన ఈ విలీనానికి అడ్డుకోవడంతో అలిగిన శివపాల్ యాదవ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన సోమవారం ఈటాలోనే ఉండిపోయారు. ఈ వ్యవహారం ఎస్పీలో బాబాయి శివపాల్ యాదవ్, అబ్బాయి అఖిలేశ్ మధ్య ముదిరిన విభేదాలను చాటుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సర్వశక్తులొడ్డుతున్న అఖిలేశ్
వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటినుంచి అధికార పార్టీని ఎస్పీ సిద్ధం చేసేందుకు అఖిలేశ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎస్పీని మరోసారి అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లతో ఏడోసారి తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టారు. తాజా విస్తరణలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయమంత్రులను తన మంత్రిమండలిలో చేర్చుకున్నారు. శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి మనోజ్ పాండే పనితీరు నచ్చక వేటువేశారు.