ఆచితూచి.. ప్రచారం..

TPCC President Election Campaign Plans Nizamabad - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ హంగూ.. ఆర్భాటం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన నియోజకవర్గాల్లోనే భారీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారానికి పరిమితమవుతోంది. కామారెడ్డిలో ఇటీవల రోడ్‌షో నిర్వహించిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఈ నెల 11న బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి రానున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికల ప్రచారం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. హంగూ.. ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. టీఆర్‌ఎస్‌ మాదిరిగా భారీ బహిరంగసభల జోలికి వెళ్లకుండా ప్రస్తుతానికి రోడ్‌షో లు, ఇంటింటి ప్రచారానికి పరిమితమవుతోంది. అది కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ ప్రచారానికి తెరలేపారు. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన చోట్ల ఆశావహులు ప్రచారంపై దృష్టి సారించారు. కామారెడ్డిలో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనున్న షబ్బీర్‌అలీ ప్రచారాన్ని ప్రారంభించారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో ఇటీవల రోడ్‌షోలు నిర్వహించారు. భిక్కనూర్‌ నుంచి కామారెడ్డి వరకు కొనసాగిన ర్యాలీ రోడ్‌ షో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు ఉత్సాహం నిం పింది. ఇదే తరహాలో బోధన్‌ నియోజకవర్గంలో కూడా రేవంత్‌రెడ్డి తో ప్రచార కార్యక్రమాలను నిర్వ హించాలని నిర్ణయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈనెల 11న నియోజకవర్గానికి రానున్న రేవంత్‌రెడ్డి మొదట నవీపేట్‌ మండల కేంద్రం నుంచి రోడ్‌షోను ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి రెంజల్‌ మీదుగా బోధన్‌ పట్టణం వరకు రోడ్‌షో కొనసాగుతుందని నేతలు ప్రకటించారు. పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆర్మూర్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా దాదాపు 20 రోజుల క్రితం నుంచే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి పొత్తులు, టీడీపీకి కేటాయించనున్న స్థానం విషయంలో స్పష్టత లేకపోవడం, ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రచా రం అంతగా సాగడం లేదు. కేవలం అసమ్మతి సెగలు లేని, స్పష్టత ఉన్న చోట్ల మాత్రమే ప్రచారం కొనసాగుతోంది.
 
ఖరారు కాని టీపీసీసీ బహిరంగ సభలు.. 
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే తొలి విడత సభల షెడ్యుల్‌లో నిజామాబాద్‌ జిల్లా ఖరారు కాలేదు. రెండో విడతలో ఈ సభలు జిల్లాలో నిర్వహించే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఆర్థిక భారానికి జడిసి.. 
మరోవైపు పోలింగ్‌కు దాదాపు రెండు నెలలు గడువుంది. ఇప్పటి నుంచే ప్రచారం జోరుగా సాగిస్తే.. ఖర్చు తడిసి మోపెడవుతుందని భావిస్తున్న ఆశావహులు ప్రచారాన్ని కొద్ది కొద్దిగా జోరు పెంచాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ., కాంగ్రె స్‌ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక., ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు చల్లారిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేసే యోచనలో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top