తెలంగాణకు చేరిన ఇంజనీర్లు | The engineers joined to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు చేరిన ఇంజనీర్లు

Sep 2 2016 1:56 AM | Updated on Sep 4 2017 11:52 AM

ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ సీలేరు పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఇంజనీర్లు గురువారం తమ విధులు బహిష్కరించి స్వరాష్ట్రానికి వచ్చారు.

టీఎస్ జెన్‌కోలో భర్తీ చేయనున్న యూజమాన్యం ?
 
 పాల్వంచ:  ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ సీలేరు పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న తెలంగాణ  స్థానికత కలిగిన ఇంజనీర్లు గురువారం తమ విధులు బహిష్కరించి స్వరాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ సీలేరు ఆంధ్రాలోకి  వెళ్లడంతో ఇంతకాలం అక్కడే విధుల్లో కొనసాగారు. ఈ క్రమంలో తెలంగాణ  స్థాని కత కలిగిన వారిని రిలీవ్ చేసి పంపించాలని అక్కడ ఇంజనీర్లు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీనికి తెలంగాణ లో అన్ని ఇంజనీర్స్ అసోసియేషన్లు సంఘీభావం తెలుపుతున్నాయి. కానీ ఉద్యోగుల విభజన చేసి పంపడంలో జాప్యంతో విధులు బహిష్కరించి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విధులు బహిష్కరించిన వారిని టీఎస్ జెన్‌కోలో భర్తీ చేసేందుకు తెలంగాణ  స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బాధ్యత తీసుకుందని తెలుస్తోంది. 

యాజమాన్యం, ప్రభుత్వం నుంచిఅనుమతి తీసుకున్నామని ఆ సంఘ నేతలు చెబుతున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు మంగీలాల్ నేతృత్వంలో సీలేరుకు వెళ్లిన 30 మంది ఇంజనీర్లు (ఏఈలు, సబ్ ఇంజనీర్లు, అకౌంట్స్ సిబ్బంది) సీఈ మోహన్ రావుకు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఆ వెంటనే వారు విధులు బహిష్కరించి తెలంగాణ  చేరుకున్నారు. మార్గమధ్యలో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్‌కు గురువారం రాత్రికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే వీరు నేరుగా టీఎస్ జెన్‌కో సీఎండీ  ప్రభాకర్‌రావును కలిసి టీఎస్ జెన్‌కోలో తమను భర్తీ చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులు సైతం టీఎస్ జెన్‌కోలో పనిచేస్తుండటంతో వారిని ఎక్కడ భర్తీ చేయాలనే విషయమై తర్జనభర్జన జరుగుతోంది. తక్కువ మందే రావడంతో వెంటనే వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీ కరించిందని ఇంజనీర్ల సంఘాలు హామీ ఇచ్చి మరీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

 తెలంగాణలో చేర్చుకునేందుకు సుముఖం
 సీలేరులో విధులు బహిష్కరించి వచ్చే వారిని తెలంగాణలో జాయిన్ చేసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement