ఇంటికి జియో ఫెన్సింగ్‌

State Government Planning For Geofencing In Telangana - Sakshi

ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా రాష్ట్రంలోని శాశ్వత నిర్మాణాలకు ట్యాగ్‌

సీఈసీ చేపట్టిన నజరీ నక్షాను విస్తృతపర్చాలని రెవెన్యూ శాఖ నిర్ణయం

ప్రతి ఇంటికి జియోరిఫరెన్స్‌ ద్వారా ప్రజాసేవలు త్వరితగతిన అందించే యోచన

అంత సులువు కాకపోయినా మేలు జరుగుతుందంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: స్వగ్రామంలో మీ ఇల్లు ఎక్కడుందో చూసుకోవాలంటే ఏం చేస్తారు. ఠక్కున గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లోకి వెళ్లి ఇంటిని వెతుకుతారు. ఊరు నమూనా తెలుసు కాబట్టి.. మీ ఇల్లు ఎక్కడుందో పసిగడతారు. అదే ప్రభుత్వం మీ ఇంటి చిరునామా తెలుసుకోవాలంటే.. చాలా కష్ట పడాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రతి ఇంటిని ‘జియో ఫెన్సింగ్‌’చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ‘నజరీ నక్షా’ఆధారంగా ప్రతి ఇంటిని ఓ నిర్దిష్ట ఆకారంగా గుర్తిస్తోంది. దీనికోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలను వాడుతోంది.

వీటిని సాధారణ మ్యాప్‌లతో అనుసంధానించడం ద్వారా ఏ శాశ్వత నిర్మాణం ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. జియో రిఫరెన్సింగ్‌ అని పిలిచే ఈ పద్ధతితో పోలింగ్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓటర్లందరి వివరాలను అదే స్టేషన్‌లో నిక్షిప్తం చేసేందు కు ఈసీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ సమస్యను మాన్యువల్‌గా అధిగమించేందుకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఈసీ చేస్తున్న కసరత్తు నజరీ నక్షా ద్వారా పూర్తి కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు 31,76,699 ఇళ్ల ఆకారాలను గుర్తించగా.. 2,01,255 ఇంటి నంబర్లను అనుసంధానించింది. 2,56,441 ఓటర్ల వివరాలను కూడా సేకరించింది.

ఏం చేస్తారంటే.. 
మొదట నియోజకవర్గ సరిహద్దులను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా నిర్దారిస్తారు. ఆపై పోలింగ్‌ కేంద్రాల పరిధిని గుర్తిస్తారు. ఆయా కేంద్రాల పరిధిలోకి వచ్చే ఓటర్ల వివరాలను బూత్‌స్థాయి అధికారి సహకారంతో క్రోడీకరిస్తారు. ఓటరు గుర్తింపు కార్డుల్లోని వివరాల ఆధారంగా ఇళ్లు ఉన్న ప్రాంతాలను, అందులోని సభ్యులను గుర్తిస్తారు. ఈసీ ఈ ఇక్కడి వరకే పరిమితం అవుతుండగా, రెవెన్యూ శాఖ దీనికి అదనంగా ఇళ్లకు జియో రిఫరెన్స్‌ ఇచ్చే ప్రక్రియకు పూనుకుంటోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశా రు. ఓటర్ల వివరాలకే పరిమి తం కాకుండా.. ప్రజావసరాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని ఆ లేఖలో సూచించారు.

ఉపయోగమేంటి.. 
రేషన్‌ పంపిణీ నుంచి మౌలి క సదుపాయాల కల్పన వరకు ఈ టెక్నాల జీ ఉపయోగపడనుంది. గ్రామాల్లో వార్డుల విభజన, క్లస్టర్లను తయారీ సులువు కానుంది. పౌరసేవల పరిధిని కూడా నిర్దేశించే వీలుంది.

పట్టణాల్లో కష్టమే..  
ఈ ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో అనుకున్నంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. పట్టణాల్లో నివసించే వారి చిరునామాలు తరచుగా మారే అవకా శం ఉందని, ఈ మేరకు నివాసం మారినప్పుడల్లా ఈ వ్యవస్థను అప్‌డేట్‌ చేసుకోవాలని భావిస్తున్నా రు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలోనూ మార్పులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నా రు. ఏదేమైనా రాష్ట్రంలోని శాశ్వత నిర్మాణాలకు జియోఫెన్సింగ్‌ ఇవ్వడం ద్వారా ప్రజావసరాలను త్వరితగతిన సమకూర్చడంతోపాటు పలు సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా అమలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top