ప్రత్యేక సర్వే | Special Survey | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సర్వే

Sep 14 2014 2:50 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఇన్నాళ్లూ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్ల వెంట కంప చెట్లను తొలగించి కూలీలకు పని కల్పించేవారు. ఇక ఇలాంటి పనులకు స్వస్తి పలకాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

ఇన్నాళ్లూ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్ల వెంట కంప చెట్లను తొలగించి కూలీలకు పని కల్పించేవారు. ఇక ఇలాంటి పనులకు స్వస్తి పలకాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు, కంటికి కనిపించే పనులు, జీవ న ప్రమాణాలు పెంచే విధంగా ఉండే పనులు గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేయనున్నారు. ఇందుకో సం జిల్లాలో పేదరికం అధికంగా ఉన్న, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న 10 మండలాలను కేం ద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా మండలాల్లో ప్రతి గ్రామానికి ఎనిమిదిమంది సభ్యులతో కూడిన బృందం వెళ్లి ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వే ప్రారంభంకానుంది.
 
 ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో ఎలాంటి ప్రయోజనం పొందారు .. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారు.. ఇంకా ఏయే పనులు కావాలి అనే వివరాలను బృందం సభ్యులు సేకరిస్తారు. గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పిస్తారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలతో కూడిన ప్రణాళికను తయారు చేసి గ్రామ సభలో ఆమోదిస్తారు. ఆ తరువాత మండల సమావేశంలో తీర్మానం చేస్తా రు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆమోదం పొంది  2014-15 ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారు. దీని కోసం ఈనెలాఖరు వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి రిసోర్స్ టీములకు శిక్షణ ఇస్తారు. అదే విధంగా గ్రామ సర్పంచ్‌లకు ఈనెల 28న మండల స్థాయిలో దీనిపై అవగాహన కల్పించనున్నారు.
 
 ఇక నుంచి ‘ఉపాధి’లో వీటికి ప్రాధాన్యం
 సర్వే అనంతరం ఇకనుంచి ఉపాధిహామీ పథకంలో భాగంగా నీటిని సంరక్షించ డం, భూమి అభివృద్ధి పనులు చేపట్టడం, మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, ఐకేపీ సెంటర్ల వద్ద గోదాము ల నిర్మాణం, కొండలు, గట్ల మీద కట్టలు పోసి నీరు ఇంకి పోయే విధంగా చేయడం, కట్టలకు చెట్లు నాటడం, లింకు రోడ్లు వేయడం లాంటి పనులకు ప్రాధాన్యమిస్తారు.
 
 ఒక బృందంలో 8 మంది వరకు..
 ప్రతి గ్రామంలో సర్వే కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందం పర్యటించనుంది. గ్రామ పరిమాణాన్ని బట్టి సిబ్బంది పాల్గొంటారు. ఒక్కో గ్రామం లో వారం రోజల వరకు కూడా ఉండి ఇంటింటికీ తిరిగి అక్కడ ప్రజలకు కావాల్సిన వివరాలు సేకరిస్తారు. గ్రామ స్థాయిలో నవంబర్ 20లోగా సర్వే పూర్తి చేసి గ్రామ సభలో, ఆ తరువాత మండల సభలో పెడతారు. డిసెంబర్ 15 నాటికి పూర్తి స్థాయి ప్రణాళికను కలెక్టర్‌కు సమర్పించి ఆమోదం పొందాలి.
     
 జిల్లా అంతటా సర్వేకు మౌఖిక ఆదేశాలు
 కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పది మండలాలనే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే విధమైన సర్వే చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. కాని క్షేత్రస్థాయిలో సర్వే చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో 10 మండలాల్లో సర్వే చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పది మండలాల్లో సర్వే పూర్తయిన తరువాత జిల్లా అంతటా చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement