
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు అనూహ్యంగా 15 రోజులపాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నగరంలోని థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు, విద్యాసంస్థలు, మద్యం షాపులు, రెస్టారెంట్లు వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలు, జనం గుమిగూడే ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఇలా ప్రత్యేక ఆంక్షలు విధించారు. అయితే, దీపావళి పండుగను పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఈ నిషేధాజ్ఞలు విధించారా? లేక ఏదైనా నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్ర ముప్పు కారణంగా ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారా? తెలియాల్సి ఉంది.