భయ‘బడి’ ! | School Building Collapse In Nalgonda District | Sakshi
Sakshi News home page

భయ‘బడి’ !

Jun 9 2018 9:16 AM | Updated on Sep 15 2018 5:37 PM

School Building Collapse In Nalgonda District - Sakshi

నేలమట్టమైన సిరిపురం ఉన్నత పాఠశాల వరండా 

రామన్నపేట(నకిరేకల్‌) : ప్రమాదం పొంచి ఉం దని చెవిలో జోరిగలాగా పదేపదే అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపానా పోలేదు. విద్యార్థుల ప్రాణం మీదికి వస్తుందని తెలిసినా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రామన్నపేట మండలం సిరిపురం ఉన్నత పాఠశాలలోని తరగతిగది పైకప్పు కూలింది. రాత్రి సమయం కావడంతో విద్యార్థులకు ప్రాణా పాయం తప్పింది.

అదే పగలు అయితే పరిస్థితి ఘోరంగా ఉండేది. రామన్నపేట మండలంలోని సిరిపురం ఉన్నత పాఠశాల భవనాన్ని 1970లో నిర్మించారు. అప్పట్టో  ఇటుక గోడలపై కొయ్యదూలాలపైన సున్నం రాయితో కప్పువేశారు. భవన నిర్మాణం జరిగి 50 ఏళ్లు కావొస్తుండడంతో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పాత భవనాల్లోనే ఆఫీస్, స్టాఫ్‌ రూం, ల్యాబ్, ఒక తరగతిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 150మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్దులు ఉపాధ్యాయులు భయంభయంగా గడుపుతుంటారు. 

పాఠశాలను సందర్శించిన డీఈఓ
సిరిపురం ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి గురువారం సందర్శించారు. స్థానిక ఎంఈఓ సల్వాది దుర్గయ్యతో కలిసి కూలిపోయిన తరగతి గదితోపాటు శిథిలావస్థకు చేరిన ఇతర గదులను పరిశీలించారు.  ప్రమాదకరంగా ఉన్నటు వంటి గదులలో తరగతులను నిర్వహించరాదని ఆదేశించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.

కొత్తగదులు కట్టించాలి పాఠశాలలోని మూడు గదులు మినహా మిగిలిన తరగతి గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి.  గదులు సరిపడా లేక శిథిలావస్థకు చేరిన గదుల్లోనే ఆఫీస్, ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. పాత భవన సముదాయాన్ని పూర్తిగా కూల్చివేసి కొత్త గదులు నిర్మించాలి.

పరశురాం, 7వ తరగతి విద్యార్థి 

Advertisement
 
Advertisement
Advertisement