‘సెయిల్’ సార్లొస్తున్నారు..


    బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అధ్యయన కమిటీ రాక

  *నేడు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ రేపు క్షేత్ర సందర్శన

 * రూ. 30 వేల కోట్ల వ్యయం

 * 2,500 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన

 * సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్న కమిటీ


 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం నేడు జిల్లాకు రానుంది. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ను పరిశీలించేందుకు వస్తున్న ఎనిమిది మంది సభ్యుల బృందం రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉంటుంది. సెయిల్ నిపుణుడు అశోక్‌కుమార్ ఝా నేతృత్వంలోని ఈ బృందం తొలిరోజు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చర్చించనుంది. రెండో రోజున జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో బయ్యారం వెళ్లి క్షేత్ర సందర్శన చేస్తుంది. అనంతరం ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

 

 తెలంగాణ రాష్ట్రంలోనే భారీ ప్రాజెక్టు...

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో స్టీలు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు ఆరునెలల్లోపు కమిటీ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా పేర్కొన్నారు. ఈ మేరకు కమిటీ ప్రతి నిధులు రాష్ట్రానికి వచ్చారు. మంగళవారం వీరంతా పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్‌లను కలిసి ఫ్యాక్టరీ ప్రతిపాదనలను తెలుసుకున్నారు. మొత్తం రూ.30 వేల కోట్ల వ్యయంతో, 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల అధికారులు తెలియజేశారు. అయితే, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను అవసరమైన భూసేకరణ, నీటి వసతి, రవాణా(రోడ్డు, రైలు మార్గాలు), విద్యుత్ తదితర సౌకర్యాలపై ఈ కమిటీ జిల్లా ఉన్నతాధికారులతో బుధవారం చర్చించనుంది.

 

కాగా, పరిశ్రమ కు అవసరమయ్యే ముడి ఖనిజాలైన డోల మైట్, ఇనుము, బొగ్గు జిల్లాలోనే అందుబాటులోనే ఉన్నాయి. వీటితో పాటు అవసరమ య్యే సున్నపురాయి (లైమ్‌స్టోన్) నిక్షేపాలు మాత్రం అందుబాటులో లేవు. ఈ నేపథ్యం లో పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పరిసరాల నుంచి లైమ్‌స్టోన్‌ను తెచ్చుకోవాలని జిల్లా అధికారులు యోచిస్తున్నా రు. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై చర్చించి పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సెయి ల్ ప్రతినిధి బృందం కేంద్రానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top