రిటైరైన వారికి రెగ్యులర్‌ పోస్టులా..?  | Regular post for retired people? | Sakshi
Sakshi News home page

రిటైరైన వారికి రెగ్యులర్‌ పోస్టులా..? 

Nov 14 2017 3:05 AM | Updated on Aug 31 2018 8:34 PM

సాక్షి, హైదరాబాద్‌: పదవీ విరమణ పొందిన వారిని తిరిగి రెగ్యులర్‌ పోస్టుల్లో ఎలా భర్తీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక పోస్టులో పనిచేసి పదవీ విరమణ పొందాక అదే వ్యక్తిని తిరిగి అదే రెగ్యులర్‌ పోస్టులో నియమిస్తే.. సర్వీసులో తర్వాతి సీనియర్లకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఇన్‌చార్జి)గా ఎం.సత్యనారాయణరెడ్డిని మరో రెండేళ్లు కొనసాగిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ ఫోరం అధ్యక్షుడు కె.శ్యాంసుందర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ధర్మాసనం సోమవారం విచారించింది. ఇలాంటి నియామకాల వల్ల రిటైరైన వారే కీలక పదవుల్లో ఉంటే పదోన్నతులు పొందేవారికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్‌ న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదించారు. ఆర్థిక శాఖ 2015లో జారీ చేసిన జీవో 55 ప్రకారం పదవీ విరమణ పొందిన వ్యక్తి సేవల్ని వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement