సాక్షి, హైదరాబాద్: నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్య రచన జరిగిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ప్రాచీన తెలంగాణ కవులపై జాగృతి తరపున పుస్తకాలు ముద్రిస్తామన్నారు. ఈ పుస్తకాలను తెలుగు విదేశీయులకు పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాల నుంచి 450మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. అంతకు ముందు రవీంద్రభారతిలో ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ విదేశాల నుంచి మహాసభలకు వచ్చిన ప్రవాస తెలుగువారికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు మహాసభల్లో సాహిత్యానికి పెద్ద పీట వేశామన్నారు.