కేసీఆర్‌కు నితీష్‌ కుమార్‌ ఫోన్‌

Nitish Kumar Called To Telangana CM KCR - Sakshi

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు కోరిన నితీష్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో​ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ ఫోన్‌ చేశారు. తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను బీజేపీ ప్రాతిపాధించిన విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిని ఓడించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రయత్నాలను ముమ్మరం​ చేసింది. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్‌ పదవీకాలం​ జూన్‌ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది.

సభలో బలాబలాలెంత
 ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్‌ఎస్‌(6), వైఎస్సార్‌సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top