పట్నా: బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో భాగంగా బిహార్లో 32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్, ఇప్పుడు పూర్తిస్థాయి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ కుమార్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
నిశాంత్ ప్రాథమిక విద్యాభ్యాసం పట్నాలోని సెయింట్ కారెన్స్ స్కూల్లోసాగింది. ఆ తర్వాత ముస్సోరీలోని మానవ్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ప్రఖ్యాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT) మెస్రా నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు.
నిశాంత్ కుమార్ చిన్నతనంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిశాంత్ రెండో తరగతి చదువుతున్నప్పుడు.. ఓ ఉపాధ్యాయుడు అతడిని బెత్తంతో కొట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నితీష్ కుమార్ కోపంతో నేరుగా స్కూల్కి వెళ్లారు. అయితే, ఉపాధ్యాయుడిపై ఎటువంటి గొడవ చేయలేదు. మౌనంగా తన కుమారుడిని వేరే పాఠశాలలో చేర్పించారు.
ఇది నితీష్ కుమార్ క్రమశిక్షణ, తన కొడుకు పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనంగా చెబుతుంటారు. 2007లో నిశాంత్ తల్లి మంజు సిన్హా మరణించారు. ఈ ఘటన నిశాంత్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన చాలా కాలం పాటు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న ఆయన అధికారికంగా జేడీయూ పార్టీలో చేరారు.


