ఉద్యోగం.. అంతా మోసం

nigerian gang Arrested Online fraud Jobs - Sakshi

ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలు 

నైజీరియా ముఠాలోని ఒకరు అరెస్ట్‌ 

నాగోలు: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ ముఠాలోని ఓ సభ్యుడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి రెండు ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్‌ ఫోన్లు,  రెండు పాస్‌పోర్టులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు తెలిపిన మేరకు.. నైజీరియాకు చెందిన కలుకల్లుచుక్వు(38) విజిటింగ్‌ వీసాపై  కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడు. అతనితోపాటు నైజీరియాకు చెందిన ఇసాక్‌ ఇమ్మాబ్రో, స్టాన్లీ, అబాయోమి, యమి,  జోసఫ్, ఎకేనాఅకుపా ఎగ్బె, మిక్కి, డొబోరే, డేనియల్‌ వీరంతా కలిసి  ముఠాగా ఏర్పడ్డారు.

 బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. వీరు ఆన్‌లైన్లో ఓఎల్‌ఎక్స్, మాట్రిమోనీ వెబ్‌సైట్లలో స్థానికంగా కొంత మందిని పరిచయం చేసుకుని విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మించారు. వారిని నమ్మిన కొందరు డబ్బునువారి అకౌంట్‌లోవేశారు.అంతేకాక స్థానికంగా ఉండే కొంతమందికి అకౌంట్‌లలో నగదు వేయించుకుని వారి ఏటీఎం కార్డు ద్వారా డ్రాచేసుకుంటూ మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన బాలకుమార్‌కు యూఎస్‌ఏలో ఉద్యోగం ఇప్పిస్తామని అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తూ వీసా కోసం డబ్బులు కావాలని అతని వద్ద నుంచి రూ.3.60లక్షలపైనా బ్యాంక్‌ అకౌంట్‌లో వేయించుకున్నారు.

 తరువాత ఉద్యోగం ఇప్పించక పోగా వారినుంచి స్పందన లేకపోవటంతో మోసపోయానని గుర్తించిన బాలకుమార్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు దీనిపై ప్రతేక దృష్టి పెట్టి మోసానికి పాల్పడుతున్న నైజీరియన్‌ ముఠాలోని కలుకల్లుచుక్వు ను అరెస్టు చేశారు. ఇతని పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో  కేసులున్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్, సీఐలు నరేందర్‌గౌడ్, జలేందర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top