నిబంధనలపై ఏం చేస్తున్నారు? | Sakshi
Sakshi News home page

నిబంధనలపై ఏం చేస్తున్నారు?

Published Wed, Dec 6 2017 1:37 AM

High Court Question to the state govt on parking charges issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆస్పత్రులు, కోర్టు ప్రాంగణాలు తదితర చోట్ల వాహనాల పార్కింగ్‌కు అక్రమంగా చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విషయంలో నిబంధనలు రూపొందించేందుకు ఏం చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆస్పత్రులు, కోర్టు ప్రాంగణాలు తదితర చోట్ల పార్కింగ్‌కు అక్రమంగా చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ నల్లగొండకు చెందిన న్యాయవాది ఆర్‌.గిరికుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో దీనిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

Advertisement
Advertisement