రైతులకు 'కరోనా' రుణం | Good news for farmers with Central Govt decision | Sakshi
Sakshi News home page

రైతులకు 'కరోనా' రుణం

May 14 2020 3:00 AM | Updated on May 14 2020 3:00 AM

Good news for farmers with Central Govt decision - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వైరస్‌ వణికిస్తున్నవేళ వారికి అండగా నిలవనుంది. రానున్న వానాకాలానికి రైతులు తీసుకునే పంట రుణాలకు అదనంగా 10 శాతం కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకర్లకు విన్నవించింది. రైతులు ఏ పంటలు వేస్తారో, ఆ ప్రకారం జిల్లాల వారీగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రైతులకు వారికున్న భూమి, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రుణ పరిమితి ఉంటుంది. ఆ నిర్ణీత సొమ్ముకు అదనంగా 10 శాతం ఇస్తారు. ఉదాహరణకు ఒక రైతుకు రూ.50వేల పంట రుణ అర్హత ఉందనుకుంటే, దానికి పది శాతం కలిపి రూ.55 వేలు ఇస్తారు. అలాగే రూ.లక్ష తీసుకునే రైతులకు రూ.1.10 లక్షలు ఇస్తారు. దీని ప్రకారం వానాకాలంలో పంట రుణ లక్ష్యం కూడా ఆ మేరకు పెరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 

మొత్తం రూ. 33,713 కోట్ల రుణం...
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయం మేరకు 2020–21 రుణ ప్రణాళికలో వానాకాలానికి రూ.30,649 కోట్ల రుణ లక్ష్యం ఉంది. కేంద్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు ఈ రుణ లక్ష్యానికి అదనంగా 10 శాతం అంటే రూ.3,064 కోట్లు అవుతుంది. అది కలిపితే రూ.33,713 కోట్లు అవుతుందని అంటున్నా రు. ఇది ఈ వానాకాలం సీజన్‌కే వర్తిస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కాగా, గతేడాది వానాకాలం సీజన్‌లో రూ.29,244 కోట్ల రు ణ లక్ష్యం ఉంటే.. రూ.18,711 కోట్లు మాత్రమే రైతులకు బ్యాంకులు పంపిణీ చేశాయి. అలాగే యాసంగి సీజన్‌లో రూ.19,496 కోట్ల లక్ష్యం పెట్టుకోగా.. రూ.14,622 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ప్రతి సీజన్‌లోనూ ఏదో కారణంతో పూర్తిస్థాయిలో రుణాలివ్వకుండా బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు.  

రుణమాఫీ లబ్ధిదారుల స్క్రీనింగ్‌...
రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొదటి విడతగా రూ.25 వేల లోపున్న రైతులకు రూ.1,200 కోట్లు జమ చేస్తారు. లబ్ధిదారుల జాబితా స్క్రీనింగ్‌ ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. రైతులు కొందరు రెండు మూడు బ్యాంకుల్లోనూ పంట రుణాలు తీసుకొని ఉంటారన్న భావనతో స్క్రీనింగ్‌ జరుపుతున్నారు. ఇది పూర్తయ్యాక తుది జాబితా తయారుచేసి రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక పంట రుణాల మాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ (నాచ్‌) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ప్రయోగాత్మకంగా రూ.11 కోట్లు ఈ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసి చూశారు. అది సక్సెస్‌ అయినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement