
తరలించిన జనాలకూ..లెక్కుంది
సార్వత్రిక ఎన్నికల సభలు, సమావే శాలకు వాహనాల్లో తరలివచ్చిన జనాలకు ఎన్నికల అధికారులు లెక్కగట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం
నల్లగొండ :సార్వత్రిక ఎన్నికల సభలు, సమావే శాలకు వాహనాల్లో తరలివచ్చిన జనాలకు ఎన్నికల అధికారులు లెక్కగట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎన్నికల వ్యయ పరిశీలకులు సభలకు వచ్చిన ఒక్కో వ్యక్తికి రెండు వందల రూపాయలను ఖర్చుగా నిర్ణయించారు. ఈ మొత్తా న్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతాలో జమ చేయనున్నా రు. వ్యయ పరిశీలకుల బృందాలు బహిరంగ సభలు, సమావేశాలకు వచ్చిన ప్రజలను వివరాలు అడిగి వీడియో ద్వారా రికార్డు చేశారు. ఈ సమయంలో అధికారులు ఆసక్తికర అంశాలను రికార్డు చేశారు. ఉదయం ఒక సభలో కనిపించిన ప్రజలు, సాయంత్రం మరొక సభలో కూడా కనిపించడం విస్మయానికి గురిచేసింది. ఈ విధంగా సభలకు వచ్చిన జనా ల నుంచి వివరాలు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోవిధం గా సమాధానం ఇచ్చారు. ఒకరు వంద కూలి, బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అని చెబితే.. మరొకరు రెండువందల కూలి, బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అని సమధానం ఇచ్చా రు.
ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన వ్యయ పరిశీలకులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఒక ధర నిర్ణయించారు. ఈ ప్రకారంగా సరాసరి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల ధర నిర్ణయించారు. అయితే ఈ మొత్తం కూడా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల వ్యయ ఖాతాల్లోకి వెళ్తుంది. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయలెక్కలు సమర్పించే అంశం పై అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో కలెక్టర్ చిరంజీవులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలకు వచ్చిన జనాలకు కూడా ధర నిర్ణయించే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, పార్టీ ల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, రూ.200 చాలా తక్కువని, తమవద్ద పూర్తి ఆధారాలున్నాయని, ప్రజ లు చెప్పిన అంశాలను రికార్డు చేశామని కలెక్టర్ చెప్పారు. అయితే, రూ.200 కాకుండా, పొరుగు జిల్లాలు నిర్ణయించిన ధరను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏజెం ట్లు, అభ్యర్థులు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
ఆర్ఓలు లేకుండానే సమీక్ష...
ఎన్నికల వ్యయ వివరాలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా వివరాలు సమర్పించలేదు. 12 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ సమావేశానికి ఏ ఒక్కరూ హాజరుకాలేదు. భువనగిరి ఆర్డీఓ మినహా మిగతా ఆర్డీఓలు హాజరయ్యారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు సమర్పించడంలో ఆర్ఓలది కీలక బాధ్యత. అలాంటి సమావేశంలో వారు లేకుండా కలెక్టర్ సమావేశాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు హాజరుకాగా, మిగతా పార్టీల నుంచి ఏజెంట్లు మాత్రమే వచ్చారు.
ముంచుకొస్తున్న గడువు...
ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేసింది. గడువులోగా అభ్యర్థులు లెక్కలు ఇవ్వకుంటే వారిపై చట్టంలో పేర్కొన్న విధంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. అభ్యర్థులు ఈ నెల 15లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంది. ఓడిన అభ్యర్థులతో పాటు, గెలిచిన అభ్యర్థులు కూడా లెక్కలు ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రంగంలోకి దిగనున్న వ్యయ పరిశీలకులు..
ఈ నెల 15 తేదీ నాటికి అభ్యర్థులు సమర్పించిన లెక్కల వివరాలను పునఃపరిశీలించేందుకు రాష్ట్రం నుంచి వ్యయ పరి శీలకులు జిల్లాకు రానున్నారు. 16,17,18 తేదీల్లో పరిశీలకులు జిల్లాలోనే మకాం వేసి అభ్యర్థులు సమర్పించిన లెక్కలు నిబంధనలకు లోబడి ఉన్నాయా..? లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. లెక్కలు ఇవ్వని అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.