ఫిబ్రవరి నుంచి ఆహార భద్రత | From February to food safety | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి నుంచి ఆహార భద్రత

Nov 24 2014 12:48 AM | Updated on Oct 2 2018 8:49 PM

ఆహార భద్రత కార్డుల ద్వారా చౌకధరలపై నిత్యావసర సరుకులను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఆహార భద్రత కార్డుల ద్వారా చౌకధరలపై నిత్యావసర సరుకులను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 15 లోపుపరిశీలించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అనంతరం సంక్రాంతి పండుగ లోపు లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులను పంపిణీ చేయాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగిరం చేశారు. ఇప్పటివరకు సామాజిక పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనతో తలమునకలైన యంత్రాంగం తాజాగా ఆహారభద్రత అర్జీల పరిశీలనకు ఉపక్రమించింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  జిల్లాలో 13.65 లక్షల వ ుంది ఆహారభద్రత కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 34.14 శాతం దరఖాస్తుల పరిశీలన మాత్రమే అధికారులు పూర్తిచేశారు. వికారాబాద్ రెవెన్యూ డివిజన్‌లో ఈ ప్రక్రియ వందశాతం పూర్తికాగా, మిగతా డివిజన్లలో మాత్రం నత్తనడకన సాగుతోంది. ము ఖ్యంగా అత్యధిక దరఖాస్తులు వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మండలాల్లో పరిశీలన  ప్రక్రియ కేవలం 4.14 శాతం మాత్రమే జరిగింది.  

జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, మల్కాజిగి రి, కాప్రా సర్కిళ్లలో 5 శాతానికి మించలేదు. అర్జీల పరిశీలన ఆ లస్యంగా సాగుతుండడం.. మరోవైపు ప్రభుత్వం సైతం ఒత్తిడి పెంచుతుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిశీలన  పూర్తయిన వికారాబాద్ డివిజన్లోని సిబ్బందిని గ్రేటర్‌కు రప్పించి ప్రక్రియను త్వరితంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 600 మంది ఉద్యోగులను గ్రేటర్ హైద్రాబాద్‌లో దరఖాస్తుల ప్రక్రియకు పంపింది. దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

అర్హత నిర్ధారణ ఎలా..?
ఇప్పటివరకు సామాజిక పింఛన్ల ప్రక్రియను పూర్తిచేసిన అధికారులకు తాజాగా ఆహారభద్రత లబ్ధిదారులను తేల్చే అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సామాజిక పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతను గుర్తించగా.. సమగ్ర కుటుంబ సర్వే(ఎస్‌కేఎస్) వివరాలతో సరిపోల్చే క్రమంలో వేలసంఖ్యలో అర్హులను తిరస్కరించింది. ఎస్‌కేఎస్ సాఫ్ట్‌వేర్, తాజాగా డాటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్ మధ్య నెలకొన్న సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను నిలిపివేసి తప్పులు సరిదిద్దేందుకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకు సంబంధించి ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో పరిశీలన ప్రక్రియపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement