ఆరుగాలం శ్రమించి పొలాన్నే నమ్ముకుని... అప్పు చేసి సాగు చేసిన ఓ రైతు చివరికి ఆ పొలంలోనే తన ప్రాణాలు తీసుకున్నాడు.
మెదక్ : ఆరుగాలం శ్రమించి పొలాన్నే నమ్ముకుని... అప్పు చేసి సాగు చేసిన ఓ రైతు చివరికి ఆ పొలంలోనే తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన డి.యాదగిరి(35) అనే వ్యక్తి కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఆలుగడ్డ సాగు చేశాడు. అందుకోసం అప్పు చేసి రూ.70వేలు పెట్టుబడి పెట్టగా... చివరికి దిగుబడి రాక పూర్తిగా నష్టమే మిగిలింది. ప్రస్తుతం ఎకరం భూమిలో సాగు చేసిన వరి కూడా ఎండిపోయింది. రూ.4 లక్షల వరకూ అప్పులు మిగలడంతో మనస్తాపానికి గురైన యాదగిరి శనివారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని భార్యతో చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
(వర్గల్)