
సాక్షి, గద్వాల : రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో గద్వాల జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మంగళవారం ఒక్కరోజే మరో ఎనిమిది కేసులు వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. ఒక్క రోజే ఎనిమిది కేసులు నమోదు కావడంతో గద్వాల ఉలిక్కిపడింది. ఈ ఎనిమిది మందిలో ఏడుగురు గద్వాల పట్టణానికి చెందిన వారే కావడం గమనార్హం. రాజోలి మండలంలో మరొకరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ఏడు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 19, నాగర్కర్నూల్ జిల్లాలో రెండు చొప్పున మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. (తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!)
తాజా కేసులతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లా అధికారుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా ఇప్పుడు కరోనా పేరు వింటేనే ఉలికిపడుతోంది. ఢిల్లీలో జరిగిన ధార్మిక సభలో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొన్న 127 మందిలో 71మంది గద్వాల జిల్లాకు చెందిన వారే ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి వివరాలు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్తో చనిపోవడం.. తాజాగా మరో ఎనిమిది మందికి పాజిటివ్ రావడంతో ఆ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.