
అసలు ఖాళీలెన్ని..?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై అంతా గందరగోళమే కనిపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఖాళీ పోస్టుల లెక్కలు
♦ రాష్ట్రంలో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యపై గందరగోళం
♦ ఒక్కో సందర్భంలో ఒక్కో లెక్క చెబుతున్న ప్రభుత్వం, అధికారులు
♦ ఈటల చెప్పినవి 24,861... ఇటీవల అసెంబ్లీలో ప్రకటించినవి 8,792
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై అంతా గందరగోళమే కనిపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఖాళీ పోస్టుల లెక్కలు చెబుతున్నారు. కానీ అసలు లెక్కలపై మాత్రం స్పష్టత లేదు. రాష్ట్రంలో 2014 నవంబర్ నాటికి 24,861 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇటీవల 8,792 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. మరి మిగతా పోస్టులు ఏమయ్యాయి..? ఈ మూడేళ్లలో హేతుబద్ధీకరణ చేయలేదు, ఎలాంటి భర్తీ ప్రక్రియ కూడా చేపట్టలేదు. అయినా పోస్టులు ఎందుకు తగ్గిపోయాయనేది గందరగోళంగా మారింది.
అనధికారికంగా హేతుబద్ధీకరించారా..?
2014 జూన్ నుంచి ఇప్పటివరకు మూడు వేల మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ పొంది ఉంటారని విద్యాశాఖ అధికారుల అంచనా. అంటే 2014లో ప్రభుత్వం పేర్కొన్న 24,861 ఖాళీలకు ఇవి అదనం. కానీ ప్రస్తుతం పాఠశాలల్లో 8,792 పోస్టులను మాత్రమే భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడిన 3 వేల ఖాళీలు పోగా.. అంతకుముందున్న ఖాళీ పోస్టులు 5,700 మాత్రమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను తగ్గించారా? అంటే.. అదేమీ లేదని విద్యా శాఖ చెబుతోంది.
మరి పోస్టులు ఎందుకు తగ్గాయన్న దానిపై మాత్రం సమాధానం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అనధికారికంగా హేతుబద్ధీకరణ చేసి, పోస్టులను తగ్గించి ఉండవచ్చని... రిటైరైన కొద్దీ ఆయా పోస్టులను రద్దు (సప్రెస్) చేశారేమోనని నిరుద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దాదాపు 4.5 లక్షల మంది ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
టీచర్ పోస్టుల సంఖ్యపై గందరగోళం ఇదీ..
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతానికి 1,07,744 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో తాత్కాలికంగా 5,23,675 పోస్టులను తెలంగాణకు కేటాయించగా.. అందులో 1,07,744 ఖాళీలున్నట్లు తేలింది. అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24,861, ఉన్నత విద్యాశాఖ పరిధిలో 10,592 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
– 2014 నవంబర్ 24న అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటన
పాఠశాలల్లో మొత్తంగా 17,702 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. అందులో 1,000 వరకు హెచ్ఎం పోస్టులు, 3,869 స్కూల్ అసి స్టెంట్, 393 పీఈటీలు, 10,469 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు, ఇతర కేటగిరీల్లో మరి కొన్ని పోస్టులు ఉన్నాయి.
– 2015 ఆగస్టులో విద్యాశాఖ తేల్చిన లెక్కలు
పాఠశాల విద్యాశాఖలో 12,142 పోస్టులు (తెలుగు మీడియంలో 10,927 పోస్టులు, ఉర్దూ మీడియంలో 1,215 పోస్టులు) ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– 2015 డిసెంబర్లో రాష్ట్ర కేబినెట్ ఈ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది
2016 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 16,193 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఎలిమెంటరీ స్కూళ్లలో (1 నుంచి 8వ తరగతి వరకు) 13,049 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 3,144 పోస్టులు ఉన్నాయి.
– 2016 జూలై 16న ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సమర్పించిన నివేదికలోని వివరాలివి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,329 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే ఏటా రూ.388 కోట్లు భారం పడుతుంది. అందులో తెలుగు మీడియం స్కూళ్లలో 1,750 ఎస్ఏ పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 1,069, పీఈటీలు 372, ఎస్జీటీలు 6,923, ఉర్దూ మీడియం స్కూళ్లలో 1,215 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
– 2016 నవంబర్లో ప్రభుత్వానికి విద్యాశాఖ సమర్పించిన నివేదికలోని వివరాలివి
రాష్ట్రంలోని పాఠ శాలల్లో 8,792 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. వాటిని వచ్చే ఆరు నెలల్లోగా భర్తీ చేస్తాం.
– గత నెలలో అసెంబ్లీలో
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటన ఇది