విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి | car accident | Sakshi
Sakshi News home page

విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి

Aug 23 2014 3:10 AM | Updated on Sep 2 2017 12:17 PM

విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి

విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి

మరదలి రిసెప్షన్ విందుకు వచ్చి ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగెళ్తుండగా లారీ ఢీకొనడంతో బావ మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది.

  •      పెళ్లింట్లో విషాదం
  •      కారును ఢీకొట్టిన లారీ
  •      వధువు బావ దుర్మరణం
  •      మరో ఐదుగురికి గాయాలు
  • బెల్లంపల్లి : మరదలి రిసెప్షన్ విందుకు వచ్చి ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగెళ్తుండగా లారీ ఢీకొనడంతో బావ మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం  జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

    వన్‌టౌన్ ఏఎస్సై ఖాదర్‌పాషా కథనం ప్రకారం... ములుగు మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన స్వాతికి, కాగజ్‌నగర్‌కు చెందిన సురేంద్రచారితో ఈ నెల 20న వివాహం జరిగింది. గురువారం రిసెప్షన్ విందు కోసం స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు కాగజ్ నగర్‌కు రెండు వాహనాల్లో వచ్చారు. వారిలో స్వాతి అక్కాబావలు హన్మకొండకు చెందిన మహారాజ అంజలి, భాస్కరచారి(28) ఉన్నారు. విందు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున వధూవరులతో కలిసి కాట్రపల్లికి బయల్దేరారు. క్వాలిస్ వాహనంలో వధూవరులు, బంధువులు, మరో కారులో భాస్కరాచారి, బంధువులు ప్రయాణిస్తున్నారు.

    మార్గమధ్యంలో బెల్లంపల్లి శివారులో మూసివేసిన 68 గని సమీపంలో మంచిర్యాల వైపు నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న భాస్కరాచారి(28) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో భాస్కరచారి భార్య అంజలి, మామ మొగిలయ్య, తోడల్లుడు కృష్ణమాచారి, బావమరిది రామకృష్ణ, తోడల్లుడి కుమారుడు ప్రదీప్‌కు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

    అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో  తీవ్ర విషాదం మిగిల్చింది. బైక్ మెకానిక్ అయిన భాస్కరచారికి కుమారులు స్నేహిత్, వర్షిత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ బానోతు బాలాజీ , తాళ్లగురిజాల ఎస్సై బి.రాజు పరిశీలించారు. మృతుడి తోడల్లుడు కస్పోజు సంజీవచారి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement