కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో అక్కడి ముఖ్యమంత్రి ప్రభుత్వ టర్మ్ మధ్యలోనే మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ రేపో, మాపో సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారన్న చర్చ జోరందుకుంది. ఈ పవర్ షిఫ్టింగ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
డీకే శివకుమార్ నేతృత్వంపై కాంగ్రెస్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను క్రమశిక్షణ గల, కష్టపడి పనిచేసే నాయకుడిగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల కేంద్ర నాయకత్వం నుంచి ఆయనకు బలమైన మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలనలో స్థిరత్వం తీసుకురావడంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించగలరన్న ఆశాభావం కాంగ్రెస్లో కనిపిస్తోంది.
అయితే ఇదే సమయంలో ఈ మార్పు వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక అగ్నిపరీక్షను కూడా పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. శివకుమార్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని నిలబెట్టగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నిర్ణయం విజయవంతమైతే కాంగ్రెస్కు బలం, విఫలమైతే పెద్ద రాజకీయ రిస్క్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ మార్పు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సిద్ధరామయ్య చెందిన కురుబా సామాజిక వర్గం నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఓబీసీ అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్కు సాంప్రదాయ మద్దతుగా కొనసాగుతాయని పార్టీ ఆశిస్తోంది.
కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యం కాలేదు. ఈ చారిత్రక ధోరణిని మార్చడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. 2028లో జరగనున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మధ్యకాలంలో నాయకత్వ మార్పు ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందన్నది రాబోయే పరిణామాలే నిర్ణయించనున్నాయి.
మరోవైపు డీకే శివకుమార్ నేతృత్వం వోక్కలిగ వర్గంలో కాంగ్రెస్కు కొత్త బలం తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో జేడీఎస్ నుంచి కొంత ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా అనుకూలంగా మారతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక సిద్ధరామయ్య పాత్ర కూడా ఈ మార్పులో కీలకంగా మారనుంది. ఆయన రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించి రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం, పార్టీ లోపల సమతుల్యతను నిలబెట్టే అంశంగా చూస్తున్నారు. శివకుమార్తో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వంలో అంతర్గత సమన్వయం ఎంతవరకు సజావుగా సాగుతుందన్నది కీలకంగా మారనుంది. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్లో జరుగుతున్న ఈ నాయకత్వ మార్పు కేవలం వ్యక్తిగత పదవుల మార్పు మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక మలుపుగా కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల పాత ధోరణిని బ్రేక్ చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడం శివకుమార్ ముందున్న అతిపెద్ద అగ్నిపరీక్షగా మారనుంది.


