
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం పదెకరాల చొప్పున భూమి కేటాయించి, భవనాలు నిర్మించి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. శుక్రవారం ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. కొన్ని కులాలకు మాత్రమే స్థలాలు కేటాయిస్తామని సీఎం తన హామీల్లో పేర్కొన్నారని, దీంతో ఇతర కులాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న అపవాదు వస్తుందన్నారు.
అలా రాకుండా అన్ని కులాలకు సంఘ భవనాల నిమిత్తం పదెకరాల చొప్పున భూమి కేటాయించి రూ.10 కోట్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీ కేటగిరీలో 112 కులాలు, ఎస్సీ కేటగిరీలో 58 కులాలు, ఎస్టీ కేటగిరీలో 35 కులాలున్నాయని పేర్కొన్నారు. కులాల వారీగా సంఘ భవనాలు నిర్మిస్తే ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికి వీలుంటుందన్నారు.