ఆదిలాబాద్ ఆపిల్ | Apple cultivation is getting ready for in the district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ ఆపిల్

Dec 19 2014 1:43 AM | Updated on Aug 20 2018 3:07 PM

ఆపిల్ పండ్లు.. చల్లని ప్రదేశాల్లో వాటిని పండిస్తారు.

ఉట్నూర్ : ఆపిల్ పండ్లు.. చల్లని ప్రదేశాల్లో వాటిని పండిస్తారు. అందుకే సిమ్లా, కశ్మీర్ వాటికి కేంద్రాలయ్యాయి. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యల్పంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇక్కడ కూడా ఆపిల్ పండ్లు పండించవచ్చని, అనుకూలమైన వాతావరణం ఉందని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయోలాజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఆపిల్ సాగుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కెరమెరి మండలం సరిహద్దు ప్రాంతాలను ఎంచుకున్నారు.  

జిల్లాలోనే అతితక్కువ ఉష్టోగ్రతలు..
శీతాకాలం వచ్చిందంటే జిల్లాలో అతితక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కెరమెరి మండల సరిహద్దు ప్రాంతాల్లో అతి తక్కువ ఉ ష్టోగ్రతలు నమోదు కావడాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. చుట్టూ గుట్ట ప్రాంతం కావడం.. అడవులు విస్తరించి ఉండడంతో ఇక్కడ తక్కువ ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాపిల్ పండ్లు సాగు కావాలంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండాలి. పంట కాలం 90నుంచి 110 రోజులు మాత్రమే ఉండడంతో ఇక్కడ ఆపిల్ సాగు సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు.  

విడుతలుగా సాగు..
ఆపిల్ పండ్ల సాగును విడుతలుగా విస్తరించాలని సీసీఎంబీ బావిస్తూంది. వచ్చే జనవరిలో ఆపిల్ సాగుకు ముందుకు వచ్చే రైతుల్లో కొంత మందిని గుర్తించి.. మొక్కలందించి సాగు చేపట్టేలా సన్నాహాలు చేయనున్నారు. ఆపి ల్ సాగు సత్ఫలితాలిస్తే విడుతలుగా విస్తీర్ణం పెంచనున్నారు. ఆపిల్ సాగు విజయవంతమైతే కశ్మీర్, సిమ్లా ప్రాంతాల సరసన మన జిల్లా చేరనుంది. కిలోకు వందల రూపాయలు వెచ్చించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపిల్  చౌకగా లభిస్తాయి.

అదీకాక ఏజెన్సీలో పోషకాహార లోపం గిరిజనులకు శాపంగా మారింది. కెరమెరి ఏజెన్సీ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు పండ్లు అందుబాటులోకి వస్తాయి. అంతేగాకుండా సాగు సక్సెస్‌తో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నిత్యం అందించే పండ్ల సరసన ఆపిల్ చేర్చవచ్చు. ఆపిల్ తోటల పెంపకానికి మన ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కొన్ని నెలల్లో తేలనుంది.

Advertisement
 
Advertisement
Advertisement