కొత్తగా 8 కేన్సర్‌ చికిత్స కేంద్రాలు! | 8 New Cancer Cure Centres To be Established in Telangana | Sakshi
Sakshi News home page

కొత్తగా 8 కేన్సర్‌ చికిత్స కేంద్రాలు!

Feb 22 2018 2:26 AM | Updated on Sep 4 2018 5:07 PM

8 New Cancer Cure Centres To be Established in Telangana - Sakshi

వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా 8 కేన్సర్‌ స్క్రీనింగ్, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన సాంకేతికత, పరికరాలు, ఇతర సహకారాలను టాటా ట్రస్ట్‌తో తీసుకోవాలని భావిస్తోంది. వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డితో టాటా ట్రస్ట్‌ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు.

వైద్యరంగంలో విశేష కృషి చేస్తోన్న టాటా ట్రస్ట్‌ తెలంగాణలోనూ తమ సేవ లు అందించడానికి ముందుకు వచ్చింది. కేన్సర్‌ వైద్య పరీక్షలు, చికిత్సకు సంబంధించి తమ సహకారం అందించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. సాంకేతికంగా, ఇతరత్రా అవసరమైన సహా య సహకారాలను అందిస్తామని టాటా ట్రస్టు ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

ఎంఎన్‌జే హాస్పిటల్‌ కేంద్రంగా..
ఎంఎన్‌జే కేన్సర్‌ హాస్పిటల్‌ కేంద్రంగా రాష్ట్రంలో 8 కేన్సర్‌ స్క్రీనింగ్, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ, మహబూబ్‌నగర్‌లోని మెడికల్‌ కాలేజీ, నిజామాబాద్‌లోని మెడికల్‌ కాలేజీల పరిధులలో ఒక్కొక్కటి.. ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో ఎంఎన్‌జే హాస్పిటల్‌లోనే కేన్సర్‌ పరీక్షలు, చికిత్సలు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఎన్‌హెచ్‌ఎం సీపీవో జి.శ్రీనివాస్, టాటా ట్రస్ట్‌ ప్రతినిధులు శ్రీనివాస్, అభిషేక్, మృణాళిని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement