మళ్లీ ఛాన్‌‌స | one more chanshs | Sakshi
Sakshi News home page

మళ్లీ ఛాన్‌‌

Jan 11 2014 3:13 AM | Updated on Aug 29 2018 8:56 PM

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు బీజేపీ శ్రీకారం చుట్టింది. సిట్టింగ్‌లందరికీ తిరిగి టికెట్లు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించింది.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు బీజేపీ శ్రీకారం చుట్టింది. సిట్టింగ్‌లందరికీ తిరిగి టికెట్లు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించింది. ఇక్కడి మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం 28కి గాను 13 నియోజక వర్గాలను అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ధార్వాడ, బెల్గాం, చిక్కోడి, బిజాపుర, బాగలకోటె, గుల్బర్గ, రాయచూరు, కొప్పళ, దక్షిణ కన్నడ, ఉడిపి, దావణగెరె, చిత్రదుర్గ, బెంగళూరు దక్షిణ నియోజక వర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయింది.

దీనికి పార్టీ పార్లమెంటరీ బోర్డు లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత తొలి జాబితా వెలువడనుంది. ధార్వాడకు ప్రహ్లాద జోషి, బెల్గాం-సురేశ్ అంగడి, చిక్కోడి-ఉమేశ్ కత్తి, బిజాపుర-రమేశ్ జిగజిణగి, బాగలకోటె-గద్ది గౌడర్, కొప్పళ-శివరామే గౌడ, దక్షిణ కన్నడ-నళిన్ కుమార్ కటీల్, దావణగెరె-బీఎం. సిద్ధేశ్, చిత్రదుర్గ-జనార్దన స్వామి, బెంగళూరు దక్షిణకు అనంత కుమార్ పేర్లు ఖరారయ్యాయి.

ఉడిపి-చిక్కమగళూరు స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడను బరిలో దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మాజీ మంత్రి శోభా కరంద్లాజెను మైసూరు-కొడగు స్థానం నుంచి పోటీ చేయించే విషయమై చర్చించారు. సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement