చర్చలు సఫలం | If the negotiations succeed | Sakshi
Sakshi News home page

చర్చలు సఫలం

Oct 30 2014 5:24 AM | Updated on Aug 31 2018 8:26 PM

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ప్రభుత్వ వైద్యుల సంఘం, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి.

  • వైద్యుల డిమాండ్లకు సర్కార్ ఓకే
  •  14 డిమాండ్లలో పదింటికి అంగీకారం
  •  రాజీనామాలను వెనక్కు తీసుకున్న డాక్టర్లు
  •  ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం
  •  ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదంటూ మండిపాటు
  •  నేడు కోర్టుకు హాజరుకావాలంటూ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడికి ఆదేశం
  • సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ప్రభుత్వ వైద్యుల సంఘం, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాము ఇచ్చిన రాజీనామాలను వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు అంగీకరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది సోమవారం నుంచి రెండు రోజులు సామూహిక రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

    సమస్యల పరి ష్కారం కోసం ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ అధ్యక్షతన పలుదఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కనబడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వైద్యుల 14 డిమాండ్లలో పదింటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

    అంతేకాకుండా తమ వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య క్షమాపణలు కూడా చెప్పారు. ఇకపై వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాకు కాని, రాజీనామాలకు కాని పాల్పడకూడదన్నారు. ఏ విషయమైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు విరుద్ధంగా జరిగి తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.
     
    ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

    రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అత్యవసర సేవల పరిధిలో ఉన్న వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగితే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించకుండా ఎందుకు ఊరికే ఉన్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగుతున్న నేపథ్యంలో వారి లెసైన్సులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎస్‌పీ అమృతేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

    ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కేఎల్ మంజునాథ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వైద్యుల సామూహిక రాజీనామాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘డిమాండ్‌ల పరిష్కారం కోసమంటూ ప్రభుత్వ వైద్యులు ప్రతిసారీ ఇలాగే రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదు. అత్యవసర సేవల పరిధిలోని వైద్యులు సమ్మెలకు దిగిన సందర్భాల్లో ఎస్మాను తప్పక ప్రయోగించాల్సిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం ఎందుకు పాటించలేదు.

    ఈ విషయంలో ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసును ఎందుకు నమోదు చేయకూడదు’ అంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యాజ్యంపై విచారణను గురువారానికి వాయిదా వేయడంతో పాటు ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య స్వయంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement