
అసలేం జరిగింది?
జయపురం సమితి అంత గ్రామానికి చెందిన ఘాసీనాగ్ కిడ్నీ మాయంపై మాచ్ఖండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కిడ్నీ ఆపరేషన్పై మాచ్ఖండ్ పోలీసుల దర్యాప్తు
బాధితుడి అనుమతితోనే తొలగింపు: ఆశాకిరణ ఆస్పత్రి
జయపురం(భువనేశ్వర్): జయపురం సమితి అంత గ్రామానికి చెందిన ఘాసీనాగ్ కిడ్నీ మాయంపై మాచ్ఖండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నీలో ఉన్న రాళ్లు తొలగించాలని ఆస్పత్రికి కిడ్నీ మాయం చేశారని లమతాపుట్ ఆశ కిరణ్ ఆస్పత్రిపై మాచ్ఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మాచ్ఖండ్ పోలీసు స్టేషన్ అధికారి బినోద్ కుమార్ మల్లిక్, ఏఎస్సై ప్రదీప్ కుమార్ నాయక్, లమతాపుట్ ఏఎస్సై శివప్రశాంత షడంగి దర్యాప్తు చేపట్టారు. లమతాపుట్లోని ఆశాకిరణ్ హాస్పిటల్కు వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి అధికారులు డాక్టర్ మాథ్యూ, డాక్టర్ వినోద్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కడుపు నొప్పితో బాధపడుతున్న తాను కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమీపంలోని ఆశకిరణ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని ఘాసినాగ్ తెలిపాడు. కిడ్నీలో రాళ్లు తొలగించాలని చెప్పి కిడ్నీ తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణపై ఆస్పత్రి యాజమాన్య వర్గాలను పోలీసులు ప్రశ్నించారు. బాధితుడి అనుమతితోనే ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించామని చెప్పినట్లు తెలిసింది. ఘాసీనాగ్ తమ ఆస్పత్రికి నాలుగు సార్లు వచ్చాడని డాక్టర్ మాథ్యూ చెప్పారని తెలిసింది. తొలిసారి 2013 జూన్11న వచ్చాడని, అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ఉందని, రెండో సారి వచ్చినపుడు అల్ట్రా సౌండ్ చేస్తే ఎడమ కిడ్నీ పాడైనట్లు గుర్తిచామని చెప్పారు. కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలని సూచించామని, ఆగస్టు 9న ఎక్స్రే తీసి చూస్తే ఎడమ కిడ్నీ పూర్తిగా పాడైందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఇతర అవయవాలకు నష్టమని చెప్పామని పోలీసులకు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదని చెప్పాడంతో 2013 సెప్టెంబర్ 7న ఘాసీనాగ్, మామ రఘునాగ్ సమ్మతితో ఆపరేషన్ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు సమర్పించినట్లు తెలిసింది. ఘాసీ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.7 వేలు మాత్రమే తీసుకున్నామని చెప్పినట్లు తెలిసింది. కాగా, ఆస్పత్రి చెబుతున్నదంతా అవాస్తవమని బాధితుడు పేర్కొన్నాడు.