
పెషావర్ ఆర్మీ స్కూల్ కు పాక్ క్రికెటర్లు
వన్డే ప్రపంచకప్ కు ఎంపికైన పాకిస్థాన్ క్రికెటర్లు పెషావర్ సైనిక పాఠశాలను శనివారం సందర్శించనున్నారు.
కరాచీ: వన్డే ప్రపంచకప్ కు ఎంపికైన పాకిస్థాన్ క్రికెటర్లు పెషావర్ సైనిక పాఠశాలను శనివారం సందర్శించనున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు ధ్రువీకరించాయని పీటీఐ పేర్కొంది. పాఠశాలను సందర్శించిన తర్వాత ప్రధాని నవాజ్ షరీఫ్ ను క్రికెట్ జట్టు సభ్యులు కలవనున్నారు.
నెల రోజుల క్రితం పెషావర్ సైనిక పాఠశాలలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. 135 మంది విద్యార్థులను కాల్చి చంపారు. పాకిస్థాన్ లో ఎక్కువ మంది విద్యార్థులు క్రికెట్ ను అభిమానిస్తారు. క్రికెట్ ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతారు. టాప్ ఆటగాళ్లను ఆరాధిస్తారు.
కాగా, ఉగ్రవాదుల రాక్షసక్రీడకు వేదికైన పెషావర్ పాఠశాలను క్రికెటర్లు సందర్శిచకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన క్రికెట్ బోర్డు ఆటగాళ్లను అక్కడకు పంపుతోంది.