పాక్‌ గెలుస్తుందని ముందే చెప్పేశాడు!

Shoaib Akhtar Predict Pakistan Win Over England Two Weeks Ago - Sakshi

ఇస్లామాబాద్‌: తన జోస్యం నిజమైందని పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మురిసిపోతున్నాడు. అక్తర్‌ అంచనా నిజమవడంతో అతడిపై సోషల్‌ మీడియాలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజయం సాధిస్తుందని మ్యాచ్‌కు రెండు వారాల ముందే(మే 22న) అక్తర్‌ జోస్యం చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిచింది.

మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఒక వీడియో షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘అవును పాకిస్తాన్‌ గెలిచింది. ఇంగ్లండ్‌ను పాక్‌ ఓడిస్తుందని రెండు వారాల క్రితమే చెప్పాను. పాకిస్తాన్‌ మేలుకుంది. కెప్టెన్‌తో పాటు జట్టు కూడా మేలుకుంద’ని వీడియోలో పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై పాక్‌ గెలుస్తుందని అక్తర్‌ రెండు వారాల ముందు చెప్పాడని, దానికి తానే సాక్ష్యమని మాజీ వికెట్‌ కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ తెలిపాడు. తాను టీవీలో మాట్లాడిన వీడియోలోని ఫొటోను తేదీతో సహా అక్తర్‌ మరోసారి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ఏం చెప్పినవ్‌ భాయ్‌, నీ అంచనా నిజమైంది’ అంటూ అక్తర్‌పై ట్విటర్‌లో నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top