మరో టీ20 రికార్డుపై రోహిత్‌ గురి

Rohit Sharma Looks Another T20 Record - Sakshi

ధర్మశాల: పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డుపై కన్నేశాడు. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న తరుణంలో రోహిత్‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. సఫారీలతో మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ మరో 85 పరుగులు సాధిస్తే న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేస్తాడు. టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ప్రస్తుతం గప్టిల్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో గప్టిల్‌ 424 పరుగుల్ని సఫారీలపై ఇప్పటివరకూ సాధించాడు. కాగా, దక్షిణాఫ్రికాపై రోహిత్‌ 340 టీ20 పరుగులు నమోదు చేశాడు. దాంతో సఫారీలపై అత్యధిక టీ20 పరుగుల్ని సాధించే అవకాశం ఇప్పుడు రోహిత్‌ ముందుంది.

ఇప్పటివరకూ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై సిరీస్‌ను గెలవకపోవడంతో దానికి ముగింపు పలకాలని విరాట్‌ సేన భావిస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రోహిత్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తే సఫారీలపై సిరీస్‌ సులువుగానే గెలవచ్చు. 2015-16 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన సిరీస్‌లో భారత్‌ 2-0 తేడాతో ఓటమి పాలైంది. రేపు రాత్రి గం.7.00లకు హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top