కూలిన టాప్ ఆర్డర్.. కష్టాల్లో టీమిండియా!
న్యూఢిల్లీ: భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 273 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 30 ఓవర్లు ముగిసే సరికి 138 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కడే క్రీజులో కుదురుకొని.. అర్ధ సెంచరీ పూర్తి చేసి.. 56 పరుగులకు ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 12 పరుగులకే ఔటవ్వగా.. డ్యాషింగ్ బ్యాట్స్మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి 20 పరుగులు చేసి.. వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ (16 పరుగులు), విజయ్ శంకర్ (16 పరుగులు) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇక, రవీంద్ర జడ్డేజా డకౌట్ అవ్వగా.. 29 ఓవర్లు ముగిసేసరికి క్రీజ్లో కేదార్ జాదవ్ 6 పరుగులతో, భువనేశ్వర్ ఒక పరుగుతో క్రీజ్లో ఉన్నారు. తన బౌలింగ్తో టీమిండియాను బెంబేలెత్తించిన ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.
అంతకుముందు ఆసీస్ బ్యాట్స్మెన్ రాణించడంతో 9 వికెట్లకు 272 పరుగుల చేసింది. సిరీస్లో మంచి ఫామ్లో ఉన్న కంగారూ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడి జోరుకు 30 ఓవర్ల వరకూ ఆసీస్ స్కోరు బోర్డు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. అతడికి తోడుగా మరో ఓపెనర్ ఫించ్ (27 పరుగులు), హ్యాండ్స్కోంబ్ (52 పరుగులు) రాణించడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేయగలిగింది.
32వ ఓవర్లో ఖవాజా ఔటైన తర్వాత ఆసీస్ స్కోరుకు బ్రేక్ పడింది. భారత బౌలర్లు చక్కని లైన్ అండ్ లైంగ్త్తో కూడిన పదునైన బంతులేసి కంగారూ బ్యాటర్ల పని పట్టారు. దాంతో 50 బంతుల వ్యవధిలో నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పెవిలియన్కు క్యూ కట్టారు. నాలుగో వన్డే హీరో టర్నర్కు తోడుగా చివరి వరస బ్యాట్స్మెన్ రిచర్డ్సన్, కమిన్స్ల రాణింపుతో ఆస్ట్రేలియా జట్టు 272 పరుగులు చేయగలిగింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు