రంగారెడ్డి రైజర్స్‌ జోరు

rangareddy beats nizamabad by 13 runs - Sakshi

13 పరుగులతో నిజామాబాద్‌ నైట్స్‌పై గెలుపు

 తెలంగాణ టి20 క్రికెట్‌ లీగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్‌ లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ జట్టు జోరు ప్రదర్శిస్తోంది. సిద్దిపేట్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్‌ నైట్స్‌పై 13 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌ గెలుపొందింది. ఈ టోర్నీలో రంగారెడ్డి రైజర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. టాస్‌ గెలిచిన నిజామాబాద్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా... అఖిల్‌ అక్కినేని సారథ్యంలోని రంగారెడ్డి రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. బ్యాట్స్‌మెన్‌ షేక్‌ సొహైల్‌ (43 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రతీక్‌ పవార్‌ (30 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో రంగారెడ్డి 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో వై. శ్రవణ్‌ కుమార్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం నిజామాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బి. సూరజ్‌ నాయక్‌ (34 బంతుల్లో 46; 8 ఫోర్లు), రాహుల్‌ సింగ్‌ గెహ్లాట్‌ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు), వంశీ కృష్ణ (22; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో వీకేఎస్‌ ఆశిష్‌ 4 వికెట్లు దక్కించుకున్నాడు.  

హైదరాబాద్‌ బోణీ  

నల్లగొండ లయన్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ శ్రీనిధియాన్‌ థండర్‌బోల్ట్స్‌ జట్టు 3 పరుగుల తేడాతో గెలిచి విజయాల బోణీ చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు సాధించింది. చందన్‌ సహాని (37 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డానీ ప్రిన్స్‌ (20; 3 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సాయి అభినయ్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం నల్లగొండ లయన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసి ఓడిపోయింది. ఆశిష్‌ రెడ్డి (31; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఎ. వరుణ్‌ గౌడ్‌ (31; 4 ఫోర్లు), శశిధర్‌ రెడ్డి (30; 1 ఫోర్, 3 సిక్సర్లు) పరవాలేదనిపించారు. హైదరాబాద్‌ బౌలర్లలో సూర్య ప్రసాద్, పుష్కర్‌ వల్లూర్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top