రోహిత్‌ శర్మ తొలిసారి.. | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ తొలిసారి..

Published Tue, Mar 5 2019 2:17 PM

First time Rohit Sharma dismissed for a Duck in a home ODI - Sakshi

నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ శర్మ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను ధావన్-రోహిత్‌ శర్మలు ఆరంభించారు. కాగా, ప్యాట్‌ కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌ రూపంలో వచ్చిన ఆ బంతిని అప్పర్‌ కట్‌కు యత్నించిన రోహిత్‌.. ఆడమ్‌ జంపాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే భారత్‌ వికెట్‌ను కోల్పోయినట్లయ్యింది. అయితే రోహిత్ శర్మ తన సొంత రాష్ట్రంలోని వీసీఏ(విదర్భా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం) మైదానంలో డకౌట్ అవడం ఇదే తొలిసారి. భారత్‌ స్కోరు 38 పరుగుల వద్ద ఉండగా భారత్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. ధావన్‌(21) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

హైదరాబాద్‌ వన్డే విజయంతో ఉత్సాహంగా ఉన్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది.   ఇక ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్‌  బరిలోకి దిగింది. ఇక ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. టర్నర్‌, జాసన్‌ బెహెండ్రాఫ్‌లకు ఉద్వాసన పలికి షాన్‌ మార్ష్‌, నాథన్‌ లియోన్‌లకు అవకాశం కల్పించింది. తొలి వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


 

Advertisement
Advertisement