
కేప్టౌన్: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిరీస్లో తొలి టెస్టు ఆరంభానికి ముందు రోజు భారత ఆటగాళ్ల వ్యవహారశైలి ఆశ్చర్యపరిచింది. గురువారం జట్టు సభ్యుల్లో ఒక్కరు కూడా కనీసం సాధన చేయలేదు. తప్పనిసరి కాదు, ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమే అని చెప్పుకున్నా... కీలక మ్యాచ్కు ముందు కొంత ప్రాక్టీస్ చేయడంలో తప్పేమీ ఉండకపోవచ్చు. మరోవైపు మ్యాచ్కు ముందు రోజు మీడియా సమావేశానికి కెప్టెన్లు హాజరు కావడం సాంప్రదాయం. కానీ కోహ్లి దీనికి డుమ్మా కొట్టి అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ను పంపించాడు.
అతను కూడా గంట ఆలస్యంగా వచ్చాడు. దాంతో చిర్రెత్తిన స్థానిక మీడియా తమ అసంతృప్తిని బహిరంగంగానే ప్రదర్శించింది. బంగర్ మాట్లాడుతుండగానే కొందరు రిపోర్టర్లు లేచి వెళ్లిపోయారు. కేప్టౌన్లో అడుగు పెట్టగానే గతవారం మాట్లాడాడు కాబట్టి కోహ్లి హాజరు కాలేదంటూ భారత మేనేజ్మెంట్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.