ధోని సంగతి తెలీదు కానీ...
విండీస్ టూర్కు 19న భారత జట్టు ఎంపిక
కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి!
న్యూఢిల్లీ: ఇప్పటివరకైతే మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై స్పష్టత లేదు కానీ... వచ్చే నెలలో వెస్టిండీస్ లో పర్యటించే భారత జట్టును మాత్రం ఈ నెల 19న ఎంపిక చేయనున్నారు. సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ముంబైలో సమావేశమై టీమిండియాను ప్రకటిస్తుంది. భారత కెప్టెన్ కోహ్లి, పేసర్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ప్రపంచకప్లో భారత్ సెమీస్ ఓటమి తర్వాత అందరి నోటా ఒకటే మాట ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేక కొన్నాళ్లు కొనసాగుతాడా? అనే చర్చే జరుగుతుంది. 38 ఏళ్ల ధోని త్వరలోనే తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ధోని నుంచి ఎలాంటి కబురు రాలేదు. సెలక్టర్లు అతనితో మాట్లాడాక ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రపంచకప్లో ధోని బాగానే ఆడాడు. అతనికి ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఏ నిర్ణయమైనా అతనే తీసుకోవాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టుల్లో పాల్గొంటుంది.
రవిశాస్త్రి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే...
టీమిండియా సహాయ సిబ్బంది కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా మిగతా బౌలింగ్, బ్యాటింగ్ కోచ్లంతా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్లకు ప్రపంచకప్ ముగిశాక వెస్టిండీస్ పర్యటన కోసం 45 రోజుల పొడిగింపునిచ్చారు.
మరిన్ని వార్తలు