సింధు శుభారంభం

Australian Open Pv Sindhu makes Impressive Starts - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ

సిడ్నీ: ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సాధించే దిశగా భారత స్టార్‌ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ నెం.5, రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సింధు 21–14,21–9తో చొయరున్నీసా (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. కాగా, పురుషుల విభాగంలో సమీర్‌ వర్మ, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఆరో సీడ్‌ సమీర్‌ 21–15, 16–21, 21–12తో లీ జీ జియా(మలేషియా)పై గెలిచాడు. ఫలితంగా సుదిర్మన్‌ కప్‌లో అతని చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి బదులు తీర్చుకున్నాడు.

ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయి ప్రణీత్‌ 21–16, 21–14తో లీ డాంగ్‌ కియూన్‌ (దక్షిణకొరియా)పై, కశ్యప్‌ 21–16, 21–15తో అవిహింగ్‌సనన్‌(థాయ్‌లాండ్‌) పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకోగా, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 18–21, 19–21తో చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తదుపరి రౌండ్‌లో జిందాపోల్‌(థాయ్‌లాండ్‌)తో సింధు, వాంగ్‌ జు వీ(తైవాన్‌)తో సమీర్, ఆంథోనీ సినిసుక గింటింగ్‌(ఇండోనేషియా)తో ప్రణీ త్‌ తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి–చిరాగ్‌ షెట్టి ద్వయం 21–12, 21–16తో మనదేశానికే చెందిన  మనుఅత్రి –సుమీత్‌ రెడ్డిజోడీని ఓడించగా,  మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ 14–21, 13–21 తో బేక్‌ హ న– కిమ్‌ హైరిన్‌(దక్షిణకొరియా)జంట చేతిలో పరాజయం పాలైంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top