19న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బీసీ గర్జన | YSR Congress Party BC Garjana on 19th | Sakshi
Sakshi News home page

19న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బీసీ గర్జన

Jan 29 2019 3:31 AM | Updated on Jan 29 2019 5:13 AM

YSR Congress Party BC Garjana on 19th - Sakshi

సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ డ్రాఫ్ట్‌ నివేదికను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు అందజేస్తున్న బీసీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ సమైక్య పరుస్తూ ఫిబ్రవరి 19న బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీలను అన్ని విధాలా ఆదుకొనేందుకు, వారి ఉన్నతి కోసం చేపట్టబోయే అనేక కార్యక్రమాలను చరిత్రాత్మకంగా జరిగే ఈ గర్జన సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తారన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ ఏడాది క్రితం బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి బీసీ వర్గాల ప్రజల బాధలు, ఇబ్బందులను తెలుసుకొని.. వారి స్థితిగతులపై సమగ్ర నివేదికను తయారు చేసింది.

ఈ నివేదికను సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌కు అందజేసింది. ఇందులోని కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌.. కమిటీతో క్షుణ్ణంగా చర్చించారు. బీసీ అధ్యయన కమిటీ గమనించిన పలు విషయాలు, సంచార జాతుల వారి బాధలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. బీసీ డిక్లరేషన్, బీసీ గర్జన సభ గురించి లోతుగా చర్చలు సాగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ కీలక నేతలు, బీసీ అధ్యన కమిటీ కన్వీనర్‌జంగా కృష్ణమూర్తి, సభ్యులు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మేపిదేవి వెంకటరమణ, జోగి రమేష్, నర్సయ్య గౌడ్, వేణుగోపాల కృష్ణ, సి.మోహనరావు, చిమట సాంబూ, మారెక్కగారి క్రిష్టప్ప, కె.చంద్రమౌళి, పత్తి దివాకర్, మీసాల రంగన్న, అవ్వారు ముసలయ్య, రాజా పరుశురామ్, బొయ తిప్పేస్వామి, కోలా గురువు, రసూల్, వల్లెపు వరప్రసాద్, టి.పుల్లయ్య తదితరులు బీసీ కులాల వెనుక బాటుతనం, వారి స్థితిగతులు, జీవన ప్రమాణాలు, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 19వ తేదీన వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన సభ ఎక్కడ జరిగేది త్వరలో ప్రకటిస్తామని, దీనిని విజయవంతం చేయడంలో బీసీలంతా భాగస్వాములు కావాలన్నారు. మీడియాతో జంగా కృష్ణమూర్తి ఇంకా ఏం చెప్పారంటే..

ఏ మొహం పెట్టుకొని జయహో బీసీ సభ పెట్టారు?
‘రాష్ట్రంలో తన అరాచక పాలనలో బీసీలను సర్వనాశనం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని జయహో బీసీ సభ పెట్టారో చెప్పాలి. బీసీలంతా మావైపే ఉన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. బీసీలకు ఏం ఒరగబెట్టారని బీసీలు మీ వైపు ఉంటారు? అవసరానికి తగినట్లు మాట్లాడే నీచమైన మనిషి చంద్రబాబు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన అంశాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? బీసీ కులాల ప్రజలు, సంచార జాతుల వారి జీవన స్థితిగతులు చాలా దుర్భరంగా ఉన్నాయి. సంచార జాతుల వారికి వారి కులం పేరు కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.

నవరత్నాలు కాపీ కొడుతున్నారు..
రాష్ట్రంలో సంవత్సరం నాలుగు నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ ప్రజలందరి బాధలు తెలుసుకున్నారు. వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో నవరత్నాలను ప్రకటించారు. నాలుగున్నరేళ్లుగా బీసీలకు, ఇతర పేద ప్రజలకు ఏ మేలూ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలలోని ప్రతి అంశాన్నీ కాపీ కొడుతున్నారు. కొత్త సీసాలో పాత సారాయి అనే విధంగా చంద్రబాబు వైఖరి ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు మళ్లీ అదే తీరులో మోసం చేయడానికి ముందుకొస్తున్నారు. 

బీసీలను కించపరిచేలా మాట్లాడారు..
బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని చెప్పిన దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు. జస్టిస్‌ ఈశ్వరయ్య ఏం చెప్పారో ప్రజలంతా చూశారు. చంద్రబాబు ఎంత బీసీ వ్యతిరేకో అందరికీ తెలుసు. బీసీలకు వ్యక్తిత్వం, క్యారెక్టర్‌ ఉండదు అని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి. న్యాయం చేయాలని అడగడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారులను తాట తీస్తానని దూషిస్తూ చంద్రబాబు మాట్లాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని నీచంగా మాట్లాడారు. మంత్రులు యనమల, అచ్చెన్నాయుడులతో కూడా బీసీలను అవమానించేలా మాట్లాడించారు. వైఎస్‌ జగన్‌ ప్రతి కులానికి కార్పొరేషన్‌ అని ప్రకటించగానే చంద్రబాబు దాన్నీ కాపీ కొట్టారు. ఇంతగా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో బీసీలంతా తగిన గుణపాఠం చెప్పాలి. 

అన్ని వర్గాలకు జగన్‌తోనే న్యాయం 
ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా కులాలు, మతాలు, రాజకీయాలకు తావు లేకుండా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా వైఎస్‌ జగన్‌ కృషి చేస్తారు. బీసీల బాధలు జగన్‌కు బాగా తెలుసు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా ఎలా పైకి తీసుకురావాలి? రాజకీయంగా అవకాశాలు, కుల వృత్తులకు చేయూత తదితర అంశాలన్నింటిపై జగన్‌కు మంచి అవగాహన ఉంది. జగన్‌ సీఎం అయితేనే బడుగు, బలహీన వర్గాల వారందరికీ న్యాయం జరుగుతుంది’ అని జంగా కృష్ణమూర్తి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement