
వైఎస్సార్ సీపీ నేత వరప్రసాద్
సాక్షి, అగిరిపల్లి : ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ నాయకుడు వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వంగా ఉందన్నారు.
ఆమరణ నిరాహార దీక్ష అనంతరం సొంత నియోజకవర్గానికి వెళ్తే ప్రజలు సంఘీభావాన్ని తెలిపారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసివుంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదని అన్నారు. ధర్మ పోరాట దీక్ష అనే పేరుతో చంద్రబాబు దీక్ష చేయడంపై మండిపడ్డారు.
ఆ పేరుతో దీక్ష చేయాల్సింది ప్రజలని అన్నారు. వాస్తవానికి చంద్రబాబు ఇచ్చిన 600 హామీలను నిలబెట్టుకోవాలని ప్రజలు ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసన తెలపాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే కచ్చితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని చెప్పారు. జగన్ వంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరికైనా ఎదురునిలబడగలరని అన్నారు.