ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం : ఉండవల్లి

Undavalli Arun Kumar Press Meet About Polavaram - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని.. ఇండియా-పాకిస్తాన్‌లా ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఒక దేశ ప్రధాని ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఐదేళ్ల తర్వాత రాజకీయ బెనిఫిట్స్‌ కోసమే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రకటనలు చేయ్యొద్దని కోరారు. మంగళవారం ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి ప్రస్తుత రాజకీయ అంశాలు, రాష్ట్ర పరిస్థితులతో పాటు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ఏపీలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని ఆరోపించారు. పోలవరం వద్ద భూమి కుంగిపోతుందని, ఇది మాములు విషయం కాదని, సరిగ్గా కట్టకపోతే రాజమండ్రి మునిగిపోతుందని హెచ్చరించారు. నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.

ఒక ప్రధాని అలా అనడం సరికాదు
రాష్ట్ర విభజన మీద చర్చ పెట్టండని మొదటి నుంచి మాట్లాడుతున్నా.ఇండియా - పాకిస్తాన్ లాగా ఆంధ్రా - తెలంగాణాని మార్చారని మోడీ ఆరోపించారు.. ఏపీ-తెలంగాణ ప్రజలు ఇక్కడ స్నేహపూర్వకంగానే ఉన్నారు. ఒక దేశ ప్రధాని దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరైనది కాదు. ఇకనైనా..కొత్తగా ఎన్నికైయ్యే అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు విభజన జరిగిన తీరు మీద మరోసారి చర్చ జరిగేలా చూడండి. తద్వారా మనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు, ఆ సమస్య ఎలా తీరుతుంది అనేది తెలుస్తుంది. 

ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం
పోలవరం పూర్తైతే 80% భూమికి నీరు అందుతుంది. పోలవరం విషయంలో మీరు వెళ్తున్న దారి సరికాదని ముందు నుంచే చెబుతూ వచ్చాను.రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజలను తీసుకెళ్లారు. నేను స్వయంగా వస్తా అంటే ఎవరూ స్పందించలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తా.  ఇరిగేషన్ మంత్రి జూన్‌లో నీళ్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. మీరు వచ్చే ఏడాది తర్వాత అయిన నీళ్లు ఎలా ఇస్తారో చెప్పండి. లెప్ట్ కెనాల్ పనులు అయ్యాయి, రైడ్ కెనాల్ పనులు పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రి కొట్డుకుపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడుచుకుపొతాయి. ఎన్నికలు అయిపోయాయి, ఎన్ని వేషాలు వేసిన ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎన్నికలు రావాలంటే ఐదేళ్లు పడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి. పోలవరం విషయం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని అక్కడి అధికారులే నాకు చెబుతున్నారు. కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది? ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేసారా? ముంపు ప్రజలకు 30 వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమే. పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబుకు లేదు. 

వీరి గొడవ ఏంటో అర్థం కావడంలేదు 
సీఎస్ వర్సెస్ సీఎం వీరి గొడవ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వైఎస్సార్‌ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టారు.ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్డు వెళ్లారు‌. కోర్టు మొట్డికాయలు వేస్తే ఎల్వీకి బాధ్యతలు ఇచ్చారు. అసలు చంద్రబాబుకు సుబ్రమణ్యంతో గొడవ ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు మీరు మోడీని  లేదా జగన్‌ను, ఇతర నేతలను విమర్శించండి. సీఎస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయలని తపన పడ్డారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నారు. 

బాబు..కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి
చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీవీ ప్యాడ్ల స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నారు. అసలు ఓటేసి తర్వాత మీడియా ముందుకొచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా నా ఓటు నాకే పడిందో లేదో తెలియ తెలియదు అనడం సరైనది కాదు. చంద్రబాబు  ఇరిటేషన్‌కి గురవుతున్నారు. కొంచెం ఇరిటేసన్ తగ్గించుకోండి చంద్రబాబు. మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుంది. వచ్చే సారి అధికారంలోకి వస్తుంది. ఎందుకు రిజల్ట్ రాకుండా ఆవేశపడుతున్నారో అర్థం కావలేదు. యూపిఏ హయంలలోనే ఈవీఎంలు ప్రారంభమైయ్యాయి.గతంలో ఓడిపోయారు, లాస్ట్ టైం అవే ఈవిఎంలతో గెలిచారు.ఇప్పుడు వాటితోనే ఎన్నికలకు వెళ్తే ఎందుకు అంత ఇదవుతున్నారు? ప్రతి నియోజకవర్గంలో ఐదు స్లిప్పులు లెక్కిస్తారు. అందులో తేడా వస్తే అప్పుడు తప్పుపట్టాలి. ఏమీ లేకుండా వివాద వివాదం క్రియేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు’  అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top