
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ముంబైలోని వర్లి స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన తండ్రి పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చేతుల మీదుగా బీ ఫామ్ను అందుకున్నారు. అయితే బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన నుంచి తొలిసారి ఠాక్రే కుటుంబం పోటీ చేస్తుండటం విశేషం. 53 ఏళ్ల కిందట (1966) స్థాపించిన శివసేనలో ఠాక్రే కుటుంబం నుంచి పోటీ చేస్తున్న తొలి వ్యక్తిగా ఆదిత్యా నిలిచారు. గతంలో మహారాష్ట్ర రాజకీయాలను కంటిసైగతో శాసించిన బాల్ ఠాక్రే తెర వెనుక నుంచి నడిపించారు కానీ.. ఎన్నికల బరిలో ఎప్పుడూ నిలవలేదు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ.. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిన ఉద్దవ్ కూడా ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్పీ) అధినేత రాజ్ ఠాక్రేది కూడా ఇదే పరిస్థితి.
అయితే తాజాగా సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఇక తన వారుసుడిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఆదిత్యా ఠాక్రేను ఎన్నికల రంగంలోకి దింపింది. ఆయన విజయానికి అత్యంత సురక్షితంగా భావించిన వర్లి నుంచి పోటీలో నిలపాలని నిర్ణయించింది. మరోవైపు పొత్తులో భాగంగా చెరో రెండున్నరేళ్లు సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగానే ఆ స్థానంలో ఆదిత్యాను పోటీలోకి తీసుకువచ్చారు. అంతకంటే ముందు డిప్యూటీ సీఎం పదవి కోసం ఇప్పటికే ఠాక్రే కర్చీఫ్ వేసిన విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలకు గాను ఆదివారంమే 20మంది అభ్యర్థులను ఠాక్రే ప్రకటించారు.