కేటీఆర్.. మిస్టర్ ఫెయిల్యూర్: షబ్బీర్
ఎన్ఆర్ఐ పాలసీని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారక రామారావుకు మిస్టర్ ఫెయిల్యూర్ బిరుదు సరిపోతుందని శాసనమం డలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లా డుతూ హామీలు ఇచ్చి అమలులో విఫలం అవుతున్నారని అన్నారు. హామీల అమలులో ఫెయిల్ అని, అవార్డుల ద్వారా ప్రచారం చేసుకోవడంలో మాత్రమే సక్సెస్ అని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో మగ్గిపోతున్న తెలంగాణ వాసులను రాష్ట్రానికి తీసుకురావాలనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే కొత్త ఎన్ఆర్ఐ పాలసీని తెస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ పాలసీ ఎక్కడికిపోయిందో చెప్పడం లేదన్నారు. గల్ఫ్ ఎన్ఆర్ఐ లకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 30 వేల మంది గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి తక్షణమే సమగ్ర విధానాన్ని తీసుకురావాలని కోరారు. వీరికోసం వెంటనే ఎన్ఆర్ఐ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు.