జనసేనకు షాక్.. పవన్ సన్నిహితుడి రాజీనామా
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు భారీ షాక్ తగిలింది. పవన్ అత్యంత సన్నిహితుడు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ పార్టీకీ గుడ్బై చెప్పారు. ఇకపై పవన్తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. పవన్ ప్రవర్తన నచ్చకనే పార్టీని వీడుతున్నానని తెలిపారు. రాజకీయ, సామాజిక అధికారం దక్కించుకోవడానికి పవన్ అనర్హుడని.. రాజకీయాలకు పనికిరాడని రాజురవితేజ సంచలన ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.
‘పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిని. పవన్ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్.. ప్రస్తుతం కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతన్ని అనుమతించకూడదు. పవన్ కల్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు. పవన్ కల్యాణ్ సమాజానికి ప్రమాదం’ అని రాజు రవితేజ్ అన్నారు.
ఎవరీ రాజు రవితేజ్
రాజురవి తేజ్ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పరిచయమైన వ్యక్తి. తాను రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రేరణ ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రాజు రవితేజ్ అని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పారు. పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి రాజు రవితేజ్ ఆయనతోనే ఉన్నారు. జనసేన పార్టీ రాజ్యాంగం అయిన పవనిజం పుస్తకాన్ని ఆయన రాశారు.