అందుకే బకాయిలు ఉన్నాయి: మంత్రి సురేష్
సాక్షి, తూర్పు గోదావరి : యూనివర్సిటీలను బలోపేతం చేసి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. త్వరలోనే యూనివర్సిటీలతో ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మీదనే కళాశాలలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పథకం లేకపోకపోతే కాలేజీలన్నీ మూతపడతాయన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అయితే ఈ పథకాన్ని అమలు చేస్తే వైఎస్సార్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఫీజు రియింబర్స్మెంట్ నేటికీ రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి సురేష్ తెలిపారు.