ఆ రెండు బిల్లులు ఆమోదిస్తే కోర్టు ఉల్లంఘనే

Chandrababu Wrote Letter To Governor Biswabhusan Harichandan - Sakshi

వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై సరైన నిర్ణయం తీసుకోండి 

గవర్నర్‌ విశ్వభూషణ్‌కు విపక్ష నేత చంద్రబాబు లేఖ   

సాక్షి, అమరావతి: హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఆమోదించడం కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆదివారం ఆరు పేజీల లేఖ రాశారు. లేఖలోని ముఖ్య అంశాలు..  

► ప్రస్తుత రాజధానిని విడగొట్టడం, తరలించే అంశాలు హైకోర్టులో ఉన్నప్పుడు, శాసనసభ నిబంధనల ప్రకారం ఈ బిల్లులను చర్చించడం, ఆమోదించడం కుదరదు. 
► ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆధారంగా రాజధాని నగరం అమరావతి ఏర్పాటైంది. ఈ రెండు బిల్లులు ఈ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకం.  
► కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజధాని నగరాన్ని ఎంపిక చేశాం.  
► వైఎస్సార్‌సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  
► ప్రస్తుత సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి కేంద్రం రూ. 2,500 కోట్లు నిధులు సమకూర్చింది.  
► హైకోర్టు ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా సుప్రీంకోర్టు అమరావతిని నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ. పది వేల కోట్లు ఖర్చు చేసింది.  
► ఇప్పటి నుంచి రాజధానిపై పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. రాజధాని నగరాన్ని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా రూపొందించడం జరిగింది. ఈ నగరమే స్వీయ ఆర్థిక సాయం అందించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది.  
► ఈ రాజధాని నగరాన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన నగరంగా పకడ్బందీగా డిజైన్‌ చేశాం.   
► వైఎస్సార్‌సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి అమరావతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ కక్షల ముసుగులోనే ఈ రెండు బిల్లులను తీసుకువచ్చింది. 
► అమరావతి శిథిలాల మీద మూడు కొత్త రాజధాని నగరాలను నెలకొల్పడానికే రెండు బిల్లులను తెచ్చింది.  
► శాసన మండలి ఈ బిల్లులను తిరస్కరించలేదు. సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సూచించింది. కౌన్సిల్‌లో రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు, సెలెక్ట్‌ కమిటీ అంశం పెండింగ్‌లో ఉండడం వల్ల ఈ బిల్లులను పరిగణించలేదు. 
► ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు బిల్లులపై నిర్ణయం తీసుకునే సందర్భంగా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి.  
► ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top