బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మందలించారన్న వార్తలను ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తోసిపుచ్చారు. ఆయన శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ...‘ నన్ను అమిత్ షా మందలించారన్న వార్తల్లో వాస్తవం లేదు. కొన్ని పత్రికలు కొందరికి మేలు చేసేందుకు అవాస్తవాలు రాస్తున్నాయి. కావాలంటే నా కాల్డేటాను పరిశీలించుకోవచ్చు. కర్నూలు సభలో నేను చేసిన రెండెకరాలు...లక్షకోట్లు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించినవి కావు. నన్ను వైఎస్ఆర్ సీపీ కోవర్టు అంటూంటే నవ్వొస్తోంది. ఇక పవన్ కల్యాణ్ జేఏసీ ఏర్పాటు మంచిదే. రాష్ట్రంలో అనిశ్చితికి ఫుల్స్టాప్ పెట్టమని కోరుతున్నా.
కొందరు నా గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్తో కలిసి టీడీపీ నేతలు ఉద్యమిస్తారా?. ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది నన్ను అణచాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. నా ఊపిరి ఉన్నంతవరకూ జాతీయవాద రాజకీయాల గురించే మాట్లాడతా. బడ్జెట్ కాపీలు నాలుగు రోజుల ముందే మంత్రులకు వెళతాయి. మరి వాటిని కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి చూడలేదా?. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి త్రికరణశుద్ధితో పని చేస్తున్నాం.’ అని తెలిపారు.


