లోకేష్‌తో ఆ పని చేయించగలరా | Ambati Rambabu Open Challenge To Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

లోకేష్‌తో ఆ పని చేయించగలరా

Jul 14 2018 2:35 PM | Updated on Aug 29 2018 3:37 PM

Ambati Rambabu Open Challenge To Cm Chandrababu Naidu - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలు ప్రచార ఆర్భాటాలకు తప్ప, ప్రజలకు ఉపయోగం లేనివని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులయ్యింది, కానీ ఇప్పటి వరకూ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరితే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన కార్యక్రమాలను ప్రజలే ప్రచారం చేసి మళ్లీ అధికారం ఇచ్చారు. బాబు తాను ప్రవేశ పెట్టిన పథకాలు 110 చెప్పమనండి చూద్దాం, లోకేష్‌తో అయినా చెప్పించండి. బీజేపీకి ఓటేస్తే వైఎస్సార్‌సీపీకి వేసినట్లు అని టీడీపీ నాయకులు అభూత కల్పన సృష్టిస్తున్నా'రంటూ మండిపడ్డారు.

కేసులు పెడతారనే భయం : 'బాబు చేతికి టీడీపీ వచ్చాక 2009 మినహా ప్రతీ సారి బీజేపీ పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుతో వెళ్లను అని చెప్పిన ప్రతీ సారి మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టి, రాజీనామాలు చేసిన తర్వాతనే, బాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ధర్మ పోరాటం అని ప్రగల్భాలు పలికారు. బీజేపీ తనపై కేసులు పెడుతుందని, వలయంగా ఉండండి సీఎం అని ప్రజలను కోరారు. రహస్యంగానే బీజేపీ మిత్రులతో  కలిసి వలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మంత్రి భార్య స్వప్న మునుగంటివార్‌కు టీటీడీ సభ్యురాలిగా పదవి ఇచ్చారు. అదే విధంగా పరకాల ప్రభాకర్‌కు కూడా పదవి ఇచ్చారు' అని అన్నారు.

పొత్తు కోసం తహతహ : 'బీజేతో పొత్తు కోసం ఒక పత్రిక అధిపతి అమిత్‌షాతో గంట సేపు ముచ్చటించారు. హామీలన్నీ అమలు చేస్తే ఇబ్బంది లేదని గడ్కరీ పర్యటనలో బాబు సంకేతం ఇచ్చారు. పోలవరంలో అవినీతి ఉందని గడ్కరీ అన్నారు. అప్పుడేమో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడేమో బీజేపీతో మాకు అంటగడుతున్నారు. కానీ బాబు మాత్రం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌తో అడ్జస్ట్ అవుతున్నారు. కుటుంబరావు మోడీ అవినీతిని నెలలోపు బయట పెడుతామన్నారు, జీవీఎల్‌ నర్సింహారావు కూడా టీడీపీ అవినీతి బయట పెడుతామన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు బయట పెట్టడం లేదు. ఏ క్షణంలోనైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు. బాబువి రాజకీయ కుయుక్తులు. నీతి ఆయోగ్‌లో మోడీ ఎడమ చేయి తాకితే అదే మహద్భాగ్యమన్నట్లు మురిసారు' అంటూ దుయ్యబట్టారు. 

టీడీపీ ఎంపీలు విచిత్ర వేషాలు : '29 సార్లు ఢిల్లీ వెళ్లిన బాబు. మీటింగ్ తర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడటం లేదు. మళ్లీ ఎందుకు కేంద్రంతో సంబంధాల కోసం తహతహలాడుతున్నారు. ప్రభుత్వ ధనంతో ధర్మ పోరాట దీక్షలు తప్ప, పోరాటం లేదు. బాబు పోరాటం చేసి వ్యక్తి కాదు. ఆయనకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య. ఈ పార్లమెంటు సమావేశంలో కూడా టీడీపీ ఎంపీలు విచిత్ర వేషాలు వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మా పార్టీ హోదా కోసం రాజీనామా చేసింది. కానీ టీడీపీ మాత్రం వేషాలు వేస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆయన మంత్రి వర్గంలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేశారు. దాని మీద విచారణ చేయాలి. కాంగ్రెస్, టీడీపీని కలిసి చూడమనండి. వైరుధ్య పార్టీలు కాంగ్రెస్, టీడీపీ కలవడం అంటేనే వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని అర్థం. ప్రజలే అన్ని కలయికల మీద  తీర్పునిస్తారు' అని అంబటి రాంబాబు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement