
హోదా కోసం గళమెత్తిన ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభలో గళమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభలో గళమెత్తారు. సమావేశాలు ప్రారంభం కాగానే వాళ్లు 'ప్రత్యేక హోదా కావాలి', 'వుయ్ వాంట్ జస్టిస్' అని నినదిస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. వారి నినాదాల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోరోజు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే దాన్ని స్పీకర్ ఆమోదించలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ నినాదాలను కొనసాగించారు. వారిని సొంత స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని, ప్లకార్డులు చూపించవద్దని స్పీకర్ చెప్పారు.
సీట్ల నుంచి కదలని టీడీపీ ఎంపీలు
ఒకవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు నేరుగా వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ ఎంపీలు మాత్రం తమ సీట్ల నుంచి కదలకుండా అక్కడే లేచి పసుపుపచ్చ రంగు ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు. అయితే కేంద్ర మంత్రులు మాత్రం ఈ ఆందోళనలో పాల్గొనలేదు.