‘టీ సంపర్క్ క్రాంతి’ ప్రారంభించలేం | we can not launch the T sampark kranthi express | Sakshi
Sakshi News home page

‘టీ సంపర్క్ క్రాంతి’ ప్రారంభించలేం

May 5 2016 2:21 AM | Updated on Sep 3 2017 11:24 PM

తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు.

లోక్‌సభలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కార్యాచరణ, ఆర్థిక వనరుల పరమైన ఇబ్బందుల వల్ల తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని మనోజ్ సిన్హా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం తిరుపతి-నిజాముద్దీన్ మధ్య ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నడుస్తోందని, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు.
 
  కాగా, కొత్తపల్లి-మనోహరాబాద్, అక్కన్నపేట్-మెదక్ మధ్య నూతన రైల్వే లైన్ల నిర్మాణపు పనులు చేపట్టినట్లు మరో ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైను నిర్మాణానికి ఇప్పటికే రూ. 1.76 కోట్ల మేర వ్యయమైందని, 2016-17 బడ్జెట్‌లో రూ. 30 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అక్కన్నపేట్-మెదక్ నూతన రైల్వే లైను నిర్మాణానికి కూడా ఇప్పటికే రూ. 118 కోట్లు మంజూరైనట్లు, పర్యావరణ అనుమతులు లభించాయని, టెండర్ల పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement