‘వారు ఇంక్‌ చల్లింది ప్రజాస్వామ్యం మీద’ | Union Minister Ashwini Choubey Attacked With Ink | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి వద్ద అశ్విని చౌబేపై ఇంక్‌ చల్లిన దుండగులు

Oct 15 2019 4:16 PM | Updated on Oct 15 2019 4:21 PM

Union Minister Ashwini Choubey Attacked With Ink - Sakshi

పట్నా: కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేకు పరాభవం ఎదురయ్యింది. డెంగ్యూ పేషెంట్లను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి ఇంకు చల్లాడు. వివరాలు.. బిహార్‌లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉంది. ఐదు రోజుల్లోనే దాదాపు 1500 మందిలో డెంగ్యూ లక్షణాలను గుర్తించారు. ఒక్క రాజధానిలోనే దాదాపు 900 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగ్యూ మరింత విజృంభించింది. ఈ నేపథ్యంలో అశ్విని చౌబే పట్నా మెడికల్‌ కాలేజీ అండ్‌ హస్పటల్‌ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి అశ్విని చౌబేపై ఇంక్‌ చల్లాడు. అప్రత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపే ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

అనంతరం అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది నా మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఆ వ్యక్తి మీడియా మీద ఇంక్‌ చల్లేందుకు ప్రయత్నించాడు. దాంతో కొంత ఇంక్‌ నా మీద పడింది. ఈ సంఘటన వెనక ఉన్న నేరస్తులు నేడు రాజకీయ నాయకులుగా ఎదగాలని చూస్తున్నారు. ఈ రోజు వారు ఇంక్‌ చల్లింది నా మీద కాదు.. ప్రజాస్వామ్యం మీద, జనాల మీద.. ప్రజాస్వామ్య మూల స్తంభం మీద’ అని చెప్పి వెళ్లి తన వాహనంలో కూర్చున్నారు. ఇక అశ్విని చౌబే మీద దాడి చేసిన వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే పప్పు యాదవ్‌ అనుచరుడిగా అనుమానిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement